కరోనా మహమ్మారి (Corona Pandemic) తర్వాత దేశం మరో అంతర్జాతీయ సంక్షోభం (ఇంధన గండం) అంచున ఉన్న తరుణంలో, ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) దేశ ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చారు. కేవలం పిలుపునివ్వడమే కాకుండా, తన నుంచే మార్పు మొదలవ్వాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో (యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతలు)(US-Iran Tensions) యుద్ధ వాతావరణం కారణంగా ముడి చమురు సరఫరాపై (Crude Oil Supply) ప్రభావం పడటంతో, దేశీయంగా ఇంధన పొదుపు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ప్రధాని కీలక చర్యలు
ప్రధాని భద్రత కోసం వినియోగించే వాహనాల కాన్వాయ్ను (Vehicle Convoy) 50 శాతం తగ్గించాలని ఎస్పీజీ (SPG) కి ఆదేశాలు జారీ చేశారు. భద్రతా ప్రమాణాల్లో (Blue Book) రాజీ పడకుండా వాహనాల సంఖ్యను తగ్గించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. కాన్వాయ్లో ఇంధన ఆధారిత వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను (EVs) చేర్చాలని ప్రధాని సూచించారు. అందుబాటులో ఉన్న వనరులనే సమర్థంగా వాడుకోవాలని స్పష్టం చేశారు.
అనవసర ప్రయాణాలను తగ్గించుకోవాలని, ప్రభుత్వ శాఖలు సాధ్యమైనంత వరకు వర్చువల్ సమావేశాలనే నిర్వహించాలని ఆదేశించారు. ప్రధాని పిలుపునకు స్పందించిన బీజేపీ(BJP) పాలిత రాష్ట్రాలు ఇంధన పొదుపు దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యమంత్రి యోగి (Yogi Adityanath) తన కాన్వాయ్తో పాటు మంత్రులు, ఉన్నతాధికారుల వాహనాల సంఖ్యను 50 శాతం తగ్గించాలని ఉత్తర్వులు జారీ చేశారు. వారానికి ఒకరోజు “నో వెహికల్ డే” (No Vehicle Day) పాటించాలని పిలుపునిచ్చారు. సచివాలయాల్లో 50% అంతర్గత సమావేశాలను ఆన్లైన్లోనే నిర్వహించాలని నిర్ణయించారు.
ప్రజలకు ప్రధాని చేసిన 9 విజ్ఞప్తులు
హైదరాబాద్లోని సికింద్రాబాద్లో జరిగిన సభలో ప్రధాని మోడీ ఇంధన ఆదా కోసం కొన్ని సూచనలు చేశారు. మెట్రో రైళ్లు అందుబాటులో ఉన్న చోట వాటినే వాడాలి. వ్యక్తిగత వాహనాల కంటే కార్ పూలింగ్ అలవాటు చేసుకోవాలి. ఐటీ, ఇతర రంగాలు సాధ్యమైనంత వరకు కరోనా సమయంలో పాటించిన వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) పద్ధతిని మళ్లీ అనుసరించాలి. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు కనీసం ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి అని ప్రధాని సూచించారు. ప్రభుత్వ పెద్దలు స్వయంగా తమ కాన్వాయ్లను తగ్గించుకోవడం ప్రజల్లో సానుకూల స్పందనను కలిగిస్తోంది.








