“న్యాయమే గెలవాలి!” బండి సంజయ్ కొడుకు కేసుపై మంచు మనోజ్ సీరియస్

"న్యాయమే గెలవాలి!" బండి సంజయ్ కొడుకు కేసుపై మంచు మనోజ్ సీరియస్

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) కుమారుడు బండి భగీరథ్‌పై (Bandi Bhageerath) నమోదైన పోక్సో కేసు (POCSO Case) అంశంపై సినీ నటుడు మంచు మనోజ్ (Manchu Manoj) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసుపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొంటూ, చట్టపరమైన ప్రక్రియలో పారదర్శకత ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

పరిస్థితులు ఎలా ఉన్నా, మైనర్ బాలికలకు (Minor Girls) న్యాయం చేయడమే పోక్సో చట్టం ప్రధాన ఉద్దేశమని మనోజ్ గుర్తుచేశారు. “అధికారం, పదవి, పలుకుబడి లేదా హోదా ఎప్పుడూ న్యాయానికి అడ్డు రాకూడదు. రాజ్యాంగం, చట్టం దృష్టిలో ప్రతి బాలికకు సమానమైన న్యాయం దక్కాల్సిందే” అని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

మైనర్లకు సంబంధించిన కేసుల్లో వేగంగా స్పందించడం చాలా అవసరమని మనోజ్ అభిప్రాయపడ్డారు. “విచారణలో జాప్యం జరిగినా, మౌనం వహించినా లేదా పక్షపాత చర్యలు తీసుకున్నా.. అది న్యాయవ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. ఇది రాజకీయాలకు లేదా వ్యక్తులకు సంబంధించిన విషయం కాదు. కేవలం నిజం బయటకు రావాలి, న్యాయం గెలవాలి” అని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం బండి భగీరథ్‌పై కేసు నమోదు కావడం, దానిపై సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించడం వంటి పరిణామాల మధ్య మంచు మనోజ్ చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment