ద్రవిడ రాజకీయాల అడ్డాలో కొత్త చరిత్ర లిఖించబడింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని అందుకున్న ‘దళపతి’ విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అనుమతినిచ్చారు. దీంతో గత రెండ్రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. శాసనసభలోనే తమ బలాన్ని నిరూపించుకుంటామని విజయ్ గవర్నర్కు స్పష్టం చేశారు.
లోక్భవన్ నుంచి అధికారిక ప్రకటన!
గురువారం ఉదయం గవర్నర్ అర్లేకర్తో భేటీ అయిన విజయ్, తన బలాన్ని వివరిస్తూ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరారు. ఇందుకు స్పందించిన గవర్నర్, ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా సూచించినట్లు సమాచారం. దీనికి సంబంధించి లోక్భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. తమిళనాట జరుగుతున్న ప్రచారం ప్రకారం, నేడే (మే 7) చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.
ఉత్కంఠ రేపిన ‘రిసార్ట్’ పాలిటిక్స్
ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మేజిక్ ఫిగర్ (118) కోసం పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మహాబలిపురంలోని ఒక రిసార్ట్లో టీవీకే ఎమ్మెల్యేలు క్యాంపులో ఉన్నారు. అన్నాడీఎంకేలో షణ్ముగం వర్గం ఎమ్మెల్యేలు పుదుచ్చేరి రిసార్ట్కు తరలిపోగా, పళనీస్వామి వర్గం మాత్రం చెన్నైలోనే మకాం వేసింది. నిన్న సాయంత్రం నుంచి రెండు ద్రవిడ పార్టీలు డీఎంకే – ఏఐఏడీఎంకే పొత్తు పెట్టుకుంటున్నాయంటూ వచ్చిన వార్తలను సీఎం స్టాలిన్, ఈపీఎస్ బృందం కొట్టిపారేసింది. అలాంటి ఆలోచనే లేదని వారు స్పష్టం చేశారు.
విజయ్కు భద్రత కుదింపు..
మరోవైపు, విజయ్ పట్ల అధికారులు వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. గవర్నర్ను కలిసే లోపే విజయ్కు ఉన్న భద్రతను, కాన్వాయ్ను అధికారులు ఉన్నఫళంగా తొలగించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. అధికార యంత్రాంగం కావాలనే ఇబ్బంది పెడుతోందని టీవీకే శ్రేణులు ఆరోపిస్తున్నాయి.








