సత్యసాయి జిల్లాలోని (Sri Sathya Sai District) కదిరి మండలంలో (Kadiri Mandal) పెను విషాదం చోటుచేసుకుంది. కుమ్మరవాండ్లపల్లిలోని ఓ ఇంట్లో భారీ పేలుడు సంబంధించిన నలుగురు దుర్మరణం చెందారు. పేలుడు ధాటికి మొత్తం 21 మందికి తీవ్ర గాయాలు కాగా, అందులో 12 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టుగా సమాచారం.
కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలోని (Kummaravandlapalli) ఓ కూలీ నివాసంలో ఈ ప్రమాదం సంభవించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆ ఇంట్లో గ్యాస్ సిలిండర్లు (Gas Cylinders) పేలడంతో పాటు, అక్కడ నిల్వ ఉంచిన నాలుగు డిటోనేటర్లు (Detonators) కూడా పేలడమే ప్రమాద తీవ్రత పెరగడానికి కారణమని తెలుస్తోంది. పేలుడు ధాటికి ఒక ఇల్లు పూర్తిగా ధ్వంసం కాగా, మూడు ఇళ్లు నేలకు ఒరిగాయి. చుట్టుపక్కల వారికి కూడా తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ప్రమాదంలో మొత్తం 21 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో 12 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితులను వెంటనే సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కొందరిని ఇతర ఆసుపత్రులకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. మరో 8 మంది తీవ్రమైన కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నారు.
పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఒకే ఇంట్లో సిలిండర్లతో పాటు డిటోనేటర్లు ఎందుకు ఉన్నాయి? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండటంతో కుమ్మరవాండ్లపల్లిలో విషాద ఛాయలు అలముకున్నాయి.








