విశాఖ నగరంలో వెలుగుచూసిన ఒక ఘోర హత్యోదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఒక నేవీ ఉద్యోగి తన స్నేహితురాలిని అతి కిరాతకంగా చంపి, మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్లో దాచిన దారుణ ఘటన విశాఖలోని ఎల్.వీ.నగర్లో చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే?
విజయనగరం జిల్లా రాజాంకు చెందిన చింతాడ రవీంద్ర (35) విశాఖపట్నంలో నేవీ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. విశాఖలోని ఎల్.వీ.నగర్లో గల ఒక అపార్ట్మెంట్లోని ఫ్లాట్లో నివాసం ఉంటున్నాడు. రవీంద్ర భార్య నెల రోజుల క్రితమే పుట్టింటికి వెళ్లారు. ఇదే క్రమంలో విశాఖకే చెందిన మౌనిక (29) అనే యువతితో రవీంద్రకు ఉన్న పాత పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆదివారం రాత్రి మౌనికను రవీంద్ర తన ఫ్లాట్కు పిలిపించుకున్నాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆగ్రహానికి లోనైన రవీంద్ర.. ఆమెను అతి దారుణంగా హత్య చేశాడు.
మృతదేహం ముక్కలుగా..
హత్య చేసిన అనంతరం సాక్ష్యాధారాలు దొరక్కుండా చేసేందుకు రవీంద్ర మౌనిక మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. వాటిని రెండు మూటల్లో కట్టి ఫ్రిజ్లో దాచిపెట్టాడు. అయితే, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించగా శరీర భాగాలు లభ్యమయ్యాయి కానీ, తల భాగం మాత్రం ఇంకా లభ్యం కాలేదని సమాచారం. ఘాతుకానికి పాల్పడిన తర్వాత రవీంద్ర స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. యువతి తనను డబ్బుల కోసం వేధిస్తోందని, ఆ వేధింపులు భరించలేకే ఈ హత్య చేసినట్లు నిందితుడు పోలీసులకు ప్రాథమిక వాంగ్మూలం ఇచ్చాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహ భాగాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తల భాగం కోసం గాలింపు చేపడుతున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది.








