మ‌రో వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే ద‌గ్గుపాటి.. ముస్లింల ఆగ్ర‌హం

మ‌రో వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే ద‌గ్గుపాటి.. ముస్లింల ఆగ్ర‌హం

వ‌రుస వివాదాల‌తో అనంత‌పురం అర్బ‌న్ ఎమ్మెల్యే (Anantapur Urban MLA) తీరు టీడీపీ(TDP)నేత‌ల‌కు త‌ల‌నొప్పిగా మారింది. జూ.ఎన్టీఆర్ త‌ల్లిని దూషించడం, ఎగ్జిబిష‌న్ నిర్వాహ‌కుల‌ను ఎమ్మెల్యే అనుచ‌రులు డ‌బ్బులు డిమాండ్ చేయ‌డం, వైన్స్ త‌గ‌ల‌బెట్ట‌డం వంటి ఘ‌ట‌న‌ల‌తో వ‌రుస వివాదాల్లో నిలిచిన ఎమ్మెల్యే ద‌గ్గుపాటి ప్ర‌సాద్ తాజాగా మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కారు. ఈసారి ఎమ్మెల్యే తీరుపై సొంత పార్టీ కార్యకర్తలే తిరుగుబాటు జెండా ఎగురవేస్తుండగా, తాజా ఘటన మైనార్టీ వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఎమ్మెల్యే అనుచరుల వేధింపులు భరించలేక నూర్ మహమ్మద్ (Noor Mohammad) అనే టీడీపీ నిఖార్స‌యిన‌ కార్యకర్త బలవన్మరణానికి పాల్పడటం స్థానిక టీడీపీలో కలకలం రేపుతోంది.

ఏం జరిగింది?
టీడీపీ మైనార్టీ నాయకుడు నూర్ మహమ్మద్ ఇటీవల తాను ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ (Daggupati Prasad)ను ఆహ్వానించారు. అయితే, ఎమ్మెల్యే అనుచరులు రాయల్ మధు, ఇస్మాయిల్‌లు నూర్ మహమ్మద్‌ను తీవ్రంగా బెదిరించడమే కాకుండా, ఎమ్మెల్యే ఆ విందుకు రాకుండా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఈ అవమానాన్ని భరించలేక నూర్ మహమ్మద్ దోమల మందు తాగి ఆత్మహత్యకు య‌త్నించాడు.

కాళ్లు మొక్కించుకుంటారా? – జేఏసీ నిప్పులు
ఈ ఘటనపై ముస్లిం సంఘాల జేఏసీ నేతలు షకిల్ షఫి (Shakeel Shafi), దాదాగాంధీ (Dada Gandhi) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ రౌడీషీటర్ల సలహాలను పాటిస్తూ సామాన్య కార్యకర్తలను వేధిస్తున్నారని వారు ఆరోపించారు. “టీడీపీ కోసం పనిచేసే మైనార్టీ నాయకుడిని ఇంటికి పిలిపించి, ఎమ్మెల్యే అనుచరులు కాళ్లు మొక్కించుకుంటారా? ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు” అంటూ నేతలు మండిపడ్డారు.

ముస్లిం జేఏసీ కీలక నిర్ణయాలు
ఎమ్మెల్యే ఆగడాలు శృతిమించాయని ఆవేదన వ్యక్తం చేసిన జేఏసీ నేతలు సంచలన నిర్ణయాలు ప్రకటించారు. ఈ రోజు నుంచి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఏ మసీదుకు వెళ్లినా, ఆ మసీదును ‘బ్లాక్ లిస్ట్‌’లో పెడతామని హెచ్చరించారు. దమ్ముంటే ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని, మైనార్టీల పవర్ ఏంటో చూపిస్తామని సవాల్ విసిరారు. నూర్ మహమ్మద్ మృతికి కారణమైన రాయల్ మధు, ఇస్మాయిల్‌లను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వానికి పరీక్షగా మారిన వివాదం
సొంత పార్టీ ఎమ్మెల్యేపైనే ఇఫ్తార్ విందు వివాదం, కార్యకర్త ఆత్మహత్యాయ‌త్నం వంటి తీవ్ర ఘ‌ట‌న‌లు తెలుగుదేశం పార్టీని రక్షణలో పడేసింది. ఈ వ్యవహారంపై అధిష్టానం ఎలా స్పందిస్తుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. గ‌తంలో నంద‌మూరి వార‌సుడు జూ.ఎన్టీఆర్‌పై, ఆయ‌న త‌ల్లిపై నోరుపారేసుకున్నా.. ద‌గ్గుపాటి ప్ర‌సాద్‌కు లోకేష్ అండ‌దండ‌లు ఉండ‌డంతోనే ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని గ‌తంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులే బ‌హిరంగంగా చ‌ర్చించుకున్న విష‌యం తెలిసిందే. వ‌రుస వివాదాల‌తో వార్త‌ల్లో నిలుస్తున్న ద‌గ్గుపాటి ప్ర‌సాద్‌పై ఈ ఘ‌ట‌న‌తోనైనా చ‌ర్య‌లు తీసుకుంటారా అనేది వేచి చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment