ఉన్న‌ బిడ్డలకే దిక్కులేదు.. ముగ్గురు కావాలా?.. – చంద్రబాబుపై షర్మిల ఫైర్

ఉన్న‌ బిడ్డలకే దిక్కులేదు.. ముగ్గురు కావాలా?.. - చంద్రబాబుపై షర్మిల ఫైర్

“రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న బిడ్డలకే ఉద్యోగాలు లేవు, సరైన బతుకు దెరువు లేదు. అలాంటిది ఇప్పుడు ముగ్గురు బిడ్డలను కనాలని చంద్రబాబు (Nara Chandrababu Naidu) చెప్పడం హాస్యాస్పదం. మీరిచ్చే ఆ బోడి 25 వేల రూపాయల కోసం మూడో బిడ్డను కనాలా?” అని ఏపీసీసీ చీఫ్ ష‌ర్మిల (Y. S. Sharmila) ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంపై, కేంద్రంలోని బీజేపీ(BJP)పై విమర్శలు కురిపించారు. ఏలూరు జిల్లా భీమడోలు మండల కేంద్రంలో జరిగిన ‘MGNREGA పరిరక్షణ యాత్ర’లో పాల్గొన్న ఆమె, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన ముగ్గురు బిడ్డల పాలసీని తీవ్రంగా తప్పుబట్టారు.

రాష్ట్రం 12 లక్షల కోట్ల అప్పుల కుప్ప
“సంక్షేమ పథకాలకు నిధులు లేవు, ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఆరోగ్య శ్రీకి (Aarogyasri) రూ. 3 వేల కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు (Fee Reimbursement Scheme) రూ. 6 వేల కోట్లు బకాయిలు పెట్టారు. పైగా రెండేళ్లలో రూ. 15 వేల కోట్ల విద్యుత్ భారంతో సామాన్యుడి నడ్డి విరిచారు” అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో పేదలకు భరోసానిచ్చిన MGNREGA పథకాన్ని బీజేపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని షర్మిల విమర్శించారు. మోదీ తీసుకొచ్చిన VB G-RAM G చట్టం పూర్తిగా కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకేనని, ఇది గ్రామ స్వరాజ్యాన్ని వినాశనం చేస్తుందని ఆరోపించారు.

మాఫియాల కోసమే పాలన!
రాష్ట్రంలో మాఫియాలు పెరిగిపోయాయని, రాష్ట్రాన్ని దోచుకుంటూ ప్రజలకు సుద్దులు చెప్పడం తగదని ఆమె హితవు పలికారు. ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డులను తొలగిస్తూ పేదల కడుపు కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు ఉపాధి హామీ పథకం పండుగలా నడిచిందని, మళ్ళీ ఆ రోజులు రావాలంటే కాంగ్రెస్ అండ అవసరమని షర్మిల పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment