రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై (Railway Kodur MLA Arava Sridhar) ప్రభుత్వ ఉద్యోగి వీణ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ఇంత వరకు ఎలాంటి చర్యలూ లేవు. కానీ, ఈ విషయం రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీశాయి. తనను నమ్మించి మోసం చేశారని, తన గర్భాన్ని పలుమార్లు తొలగించారని ఆమె మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పడంతో పాటు, వీడియోలు, వాట్సప్ చాటింగ్ను విడుదల చేసి.. తనకు న్యాయం చేయాలని ఇప్పటికీ డిమాండ్ చేస్తూ పోరాటం కొనసాగిస్తున్నారు.
ఈ ఆరోపణల నేపథ్యంలో జనసేన పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు అరవ శ్రీధర్ వివరణ ఇచ్చుకున్నారు. అయితే వివరణ ఇచ్చినప్పటికీ ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు నివేదిక సమర్పించలేదు, అరవ చర్యలు తీసుకోలేదు.. బాధితురాలికి న్యాయం జరగలేదు. బాధితురాలు వీణ మాత్రం రోజుకో వీడియో విడుదల చేస్తోంది. దీంతో పలువురు ఎమ్మెల్యేలు ఆయన ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ పరువు తీస్తున్నారా?
ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలకు అరవ శ్రీధర్ హాజరుకాకపోవడం మరోసారి చర్చనీయాంశమైంది. అసెంబ్లీకి రాకపోవడంపై జనసేన ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ పరంగా అసెంబ్లీకి రావద్దని ఎక్కడా చెప్పలేదని, కేవలం పార్టీ వ్యవహారాల నుంచి దూరంగా ఉండాలని మాత్రమే సూచించామని తెలిపారు.
పార్టీ కోసం కష్టపడి పని చేసి, కేసులు ఎదుర్కొని, జైళ్లకు వెళ్లి ఈ స్థాయికి చేరుకున్నామని, ఇప్పుడు కొందరి చర్యల వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని బొలిశెట్టి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం వచ్చిన వెంటనే కొందరికి బాధ్యతలు మరచిపోతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వివాదం ఎలా మలుపు తిరుగుతుందో, పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.








