ఏపీ (Andhra Pradesh) మంత్రి నారా లోకేష్ (Nara Lokesh)పై వైసీపీ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. “నిక్కర్ మంత్రి నారా లోకేష్ అడ్రస్ ఎక్కడ..?” అంటూ వైసీపీ(YSRCP) అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి చేసిన వ్యాఖ్య తీవ్ర చర్చకు దారితీసింది. గత రెండు రోజులుగా మంత్రి లోకేష్ ప్రజలకు, మీడియాకూ కనిపించకపోవడంతో ఈ ప్రశ్నను వైసీపీ లేవనెత్తింది.
ఈ ట్వీట్కు నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది లోకేష్ హైదరాబాద్ (Hyderabad)లో సేదతీరుతున్నారని వ్యాఖ్యానిస్తే, మరికొందరు విదేశీ పర్యటనలో ఉన్నారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రశ్నకు అధికారిక సమాచారం ప్రకారం మంత్రి నారా లోకేష్ లండన్ (London) వెళ్లినట్టు తెలుస్తోంది. కానీ, ఈ పర్యటనపై ముందస్తు ప్రకటన లేకపోవడంతో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. సాధారణంగా ముఖ్యమంత్రి లేదా మంత్రులు విదేశీ పర్యటనకు వెళ్తే ముందుగానే అధికారిక ప్రకటన విడుదల చేస్తారు. కానీ ఈసారి అలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం.
ఇటీవల మంత్రి లోకేష్ విదేశీ పర్యటనలపై నెటిజన్లు ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు. గత మూడు నెలల్లోనే నాలుగు విదేశీ పర్యటనలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది అక్టోబర్లో ఆస్ట్రేలియాకు వెళ్లిన లోకేష్, డిసెంబర్లో అమెరికా (USA), కెనడా (Canada) టూర్ వెళ్లొచ్చారు. డిసెంబర్ 6 నుంచి 10 వరకు ఐదు రోజుల పాటు అక్కడ ఉన్నారు. ఆయా పర్యటనలకు అధికారిక వివరాలు వెలువడ్డాయి.
కాగా, ఈ విదేశీ పర్యటనలన్నీ ప్రభుత్వ ఖర్చులతోనే జరుగుతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ రాష్ట్ర, హైదరాబాద్ పర్యటనలకు స్పెషల్ ఫ్లైట్స్, హెలికాప్టర్లకు ప్రభుత్వ ఖజానా భారం పడుతుందనే ఆరోపణ ఉండగా, విదేశీ పర్యటనలు ఖజానాకు మరో భారంగా మారాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
కానీ, తాజాగా లండన్ పర్యటనపై మాత్రం అటు టీడీపీ(TDP) నుంచి, ఇటు ఆయన శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం రాజకీయంగా ప్రశ్నలకు దారితీస్తోంది. మంత్రి లోకేష్ ఎందుకు లండన్ వెళ్లారు? అది అధికారిక పర్యటనా? లేక వ్యక్తిగత కారణాలా? అన్న అంశాలపై స్పష్టత వెలువడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ చేసిన ట్వీట్ మరింత రాజకీయ వేడి పెంచుతోంది. లండన్ పర్యటనపై టీడీపీ స్పష్టత ఇస్తుందా..? ఇస్తే, మళ్లీ అది పెట్టుబడుల టూర్ అనే సమాధానమే వస్తుందని నెటిజన్లు ముందుగానే జోస్యం చెబుతున్నారు. మరి ఆ పార్టీ ఏమని ఆన్సర్ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.








