ప్రముఖ నటుడు మోహన్బాబు కుటుంబ వివాదం రోజుకో కొత్త మలుపు తీసుకుంటుంది. నిన్నటి వరకు కుటుంబ కలహాలు, ఆస్తి, యూనివర్సిటీ, జర్నలిస్టుపై దాడి, లైసెన్డ్స్ గన్స్ సరెండర్, మోహన్బాబు అరెస్టు వంటి వార్తలు చక్కర్లు కొట్టగా.. తాజాగా మోహన్బాబు భార్య విడుదల చేసిన లేఖ సంచలనంగా మారింది.
తన కుమారుడు మంచు మనోజ్ చేసిన ఆరోపణలపై ఆయన తల్లి నిర్మల సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల క్రితం జనరేటర్లో చక్కెర పోశారని మనోజ్ చేసిన ఫిర్యాదులో ఎలాంటి నిజం లేదని ఆమె ఖండించారు. ఈ విషయాన్ని పహాడీ షరీఫ్ పోలీసులకు లేఖ రూపంలో వివరిస్తూ, తన కుమారుడు విష్ణు ఎవరితోనూ గొడవ పెట్టుకోలేదని స్పష్టం చేశారు. తన పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేయించి, వేడుకలు జరిపి విష్ణు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిపారు. అంతకు మించి ఎటువంటి ఘటనలు జరగలేదని ఆమె వివరించారు.
వివాదం ముగుస్తుందా లేదా?
మంచు నిర్మల విడుదల చేసిన లేఖ దర్యాప్తులో కీలకం కానుట్లుగా తెలుస్తోంది. ఈ అంశం ఇప్పుడు ప్రేక్షకుల్ని, అభిమానుల్ని పెద్ద సందేహాల్లో పడేసింది. మంచు కుటుంబం మధ్య నెలకొన్న ఈ ఘర్షణ పట్ల అందరిలో ఆసక్తి పెరుగుతోంది. ఈ లేఖతో మంచు ఫ్యామిలీలో వివాదం ముగుస్తుందా.. లేదా అనేది వేచి చూడాలి.