ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు హైకోర్టులో మరో షాక్ తగిలింది. ఆయనపై కేసును పునర్విచారణ చేయాలని మహిళా వలంటీర్ల తరఫున క్రిమినల్ రివిజన్ పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్ను ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ హైకోర్టులో దాఖలు చేశారు.
కేసు ఉపసంహరణపై ఆరోపణలు
గతంలో పవన్ కల్యాణ్ వలంటీర్లపై వివాదాస్ప వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై అప్పటి ప్రభుత్వం కోర్టుకెక్కింది. అయితే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ కేసును ఏ కారణం లేకుండానే ఉపసంహరించడం చట్ట విరుద్ధమని పిటిషనర్లు ఆరోపించారు. గుంటూరులోని నాలుగవ అదనపు జిల్లా కోర్టు తన పరిధి దాటి ఈ కేసు ఉపసంహరణకు అనుమతి ఇవ్వడం న్యాయ ప్రక్రియకు విరుద్ధం అని పిటిషనర్లు పేర్కొన్నారు.
పవన్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు
రాష్ట్రంలో వైసీపీ హయాంలో ఉండగా 30 వేల మంది మహిళలు మాయమవ్వడానికి వలంటీర్లు కారణమని, అలాగే వారిని వ్యభిచారానికి దిగజార్చారని ఎన్నికల సభల్లో ఆరోపించిన విషయం చర్చనీయాంశమైంది. ఈ వ్యాఖ్యలపై వలంటీర్లు ఆయనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
పిటిషనర్ల వాదనలు
అధికారం అడ్డం పెట్టుకుని కేసులను ఉపసంహరించుకోవడం సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకమని పిటిషనర్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన అధికార దుర్వినియోగం వలంటీర్ల మనోభావాలను దెబ్బతీసిందని వారు నొక్కి చెప్పారు. ఈ కేసు రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ పిటీషన్ హైకోర్టులో కేసు పునరుద్ధరణకు దారితీస్తుందా లేదా అనేది రాజకీయంగా ఆసక్తికర అంశంగా మారింది.