కాలేజీ యాజమాన్యం (College Management) వేధింపులు (Harassment) భరించలేక ఇంటర్మీడియట్ విద్యార్థి(Intermediate Student) కళాశాల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన తిరుపతి జిల్లా (Tirupati District)లో చోటుచేసుకుంది. చంద్రగిరి (Chandragiri) మండలం అగరాల సమీపంలోని నారాయణ కాలేజీలో ఈ దారుణ ఘటన జరిగింది. చదువుపేరుతో జరుగుతున్న ఒత్తిడి, వేధింపులు భరించలేక ఇంటర్ విద్యార్థి మహీధర్ రెడ్డి (Mahidhar Reddy) భవనం మూడో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.
తలపై తీవ్ర గాయాలతో మహీధర్ రెడ్డి పరిస్థితి విషమంగా మారింది. స్థానికులు, కాలేజ్ సిబ్బంది అతడిని వెంటనే తిరుపతిలోని అమర హాస్పిటల్ (Amara Hospital)కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉందని వెల్లడించారు.
అన్నమయ్య (Annamayya) జిల్లా కలికిరికి చెందిన మహీధర్ రెడ్డి, అగరాల నారాయణ కాలేజీలో ఇంటర్ ఎంపీసీ సెకండియర్ చదువుతున్నాడు. చదువు ఒత్తిడి, అధ్యాపకుల వేధింపులు భరించలేక ఈ దారుణ చర్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు, సహ విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
ఇదే ఒత్తిడి కారణంగా హాస్టల్ భవనం నుంచి పారిపోయేందుకు ఆరుగురు విద్యార్థులు ప్రయత్నించినట్లు సమాచారం. కాలేజీలో జరుగుతున్న వేధింపుల విషయాన్ని విద్యార్థులు ముందే పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పెద్దగా స్పందన రాలేదని తెలుస్తోంది. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారుల దృష్టి సారించాలని కోరుతున్నారు.








