మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు (కేటీఆర్) (KTR) తెలంగాణ ప్రభుత్వ (Telangana Government) విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో పరిశ్రమల స్థాపన కోసం రాయితీపై కేటాయించిన అత్యంత విలువైన ప్రభుత్వ భూములను (Government Lands), ఇప్పుడు మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు విక్రయించడం ద్వారా రూ. 5 లక్షల కోట్ల భారీ భూ కుంభకోణానికి (Land Scam) ప్రభుత్వం పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. కుత్బుల్లాపూర్లోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో పర్యటించిన ఆయన, ఒక్క ఈ ప్రాంతంలోనే రూ. 75 వేల కోట్ల విలువ చేసే భూములు ఉన్నాయని వెల్లడించారు. ఈ భూములను పేదలకు ఇళ్లు కట్టడానికి, స్కూళ్లకు, శ్మశాన వాటికలకు కేటాయించకుండా, రిజిస్ట్రేషన్ ధరలో కేవలం 30 శాతం మాత్రమే తీసుకొని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం ప్రైవేట్ జేబులు నింపడానికి తప్ప మరోటి కాదని కేటీఆర్ మండిపడ్డారు.
ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలను హెచ్చరించిన కేటీఆర్, ప్రభుత్వం ఇస్తున్న ఈ “ఆషాఢ సేల్” (“Ashada Sale”) లాంటి ఆఫర్కు మోసపోవద్దని, బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టం ద్వారా ఈ భూములను వెనక్కి తీసుకుంటుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి (Chief Minister)రేవంత్ రెడ్డి (Revanth Reddy)ని ‘అవినీతి అనకొండ’ గా అభివర్ణించిన కేటీఆర్, ఆయన ఢిల్లీకి మూటలు పంపేందుకు, రాష్ట్రంలో దోచుకునేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కోకాపేటలో వందల కోట్లు విలువ చేసే భూమి, జీడిమెట్ల ప్రాంతంలో కేవలం రూ. 4000 చొప్పున గజం ఇవ్వజూపడం అన్యాయమన్నారు. హిల్ట్ (HILT) పాలసీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, లక్షల మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి ఇళ్లు కట్టించకుండా పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేయడం సరికాదని అన్నారు.
ఈ భూ కుంభకోణంపై బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేయాలని నిర్ణయించిందని కేటీఆర్ ప్రకటించారు. అవగాహన సదస్సులు, అఖిల పక్ష సమావేశాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడంతో పాటు న్యాయస్థానాల్లో పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. ఈ పోరాటంలో కార్మిక సంఘాలను కూడా కలుపుకొని వెళ్తామని చెప్పారు. హిల్ట్ భూముల విషయంలో ఇది ఆరంభం మాత్రమేనని, దోపిడీ జరుగుతుంటే ఎవరో తెలంగాణ బిడ్డ సమాచారం ఇచ్చారని, తమ పోరాటం ఇంకా కొనసాగుతుందని కేటీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.








