తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరినట్లు తెలిపారు. గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ ఉన్నప్పుడు, నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గుజరాత్ అభివృద్ధికి సహకరించిన విషయాన్ని తాను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్-బెంగళూరు-చెన్నై మార్గంలో బుల్లెట్ రైలు ప్రాజెక్టును మంజూరు చేయాలని కోరారు. దీంతో పాటు, రీజినల్ రింగ్ రోడ్డు (RRR) సౌత్ ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు మరియు నిధులను త్వరగా విడుదల చేయాలని కూడా ప్రధానమంత్రిని వినతి చేసినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు.
గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానం
మరోవైపు, తన తాజా రాజకీయ వ్యాఖ్యలపై అనవసర వివాదం సృష్టిస్తున్నారని పేర్కొన్న సీఎం, డీసీసీ అధ్యక్షుల సమావేశంలో పార్టీలోని విభిన్న మనస్తత్వాల గురించి మాత్రమే తాను వివరించానని తెలిపారు. డీసీసీ అధ్యక్షులు చిన్న వయసు వారైనా పెద్ద బాధ్యతలో ఉన్నారని చెప్పే ప్రయత్నం చేశానని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆయన తెలంగాణలో మరో రెండు టర్ములు ముఖ్యమంత్రిగా తానే ఉంటానని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ కు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అశ్విని వైష్ణవ్ సహా కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ఆహ్వానం అందించారు. ఈ సమ్మిట్ ద్వారా రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్’ గురించి కూడా ముఖ్యమంత్రి వారికి వివరించారు.








