అర్బన్ నక్సల్స్ (Urban Naxals) పట్టణాల్లో జల్సాగా జీవిస్తూ, ఏ ప్రభుత్వం వచ్చినా తమ పైరవీలతో ఆస్తులు పోగేసుకుంటారని కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ, వారి మాటలు నమ్మిన అమాయక మావోయిస్టులు అడవుల్లో తిండి, తిప్పలు లేక తిరుగుతూ ప్రాణాలు కోల్పోతున్నారని సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. వేములవాడ (Vemulawada)లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మావోయిస్టులను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
మావోయిస్టుల మరణాలకు అసలు కారణం అర్బన్ నక్సల్సే అని బండి సంజయ్ స్పష్టం చేశారు. నగరాల్లో విలాసవంతమైన సౌకర్యాలతో జీవించే ఈ అర్బన్ నక్సల్స్ మావోయిస్టుల్ని ప్రేరేపించి, స్వయంగా ఏ ప్రమాదాన్నీ ఎదుర్కోరని ఆయన మండిపడ్డారు. నక్సల్స్కు సపోర్ట్ చేసే అర్బన్ నక్సల్స్ ద్రోహులని, వారు మావోయిజం పేరిట అమాయకులను బలితీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
మావోయిస్టులు వెంటనే తుపాకీని వదిలి, జనజీవన స్రవంతిలో కలవాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. “ఇక మిమ్మల్ని మార్చుకునేందుకు నాలుగు నెలల గడువే ఉంది. వచ్చేనెల మార్చి నాటికి మావోయిజాన్ని పూర్తిగా అంతం చేసి తీరతాం” అని సంజయ్ హెచ్చరించారు. మావోయిజం వల్ల వందలాది కుటుంబాలు నష్టపోతున్నాయని, ఆ మార్గాన్ని వెంటనే విడిచి పెట్టాలని అన్నారు.
ఈ సందర్బంగా, వేములవాడ ఏరియా ఆసుపత్రికి రూ.1.5 కోట్ల విలువైన వైద్య పరికరాలను బండి సంజయ్ అందజేశారు. స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా కేంద్రం ఎల్లప్పుడూ సహకారం అందిస్తుందని ఆయన తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధి కోసం మరిన్ని చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.








