ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సారథ్య బాధ్యతలు నూతన వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనున్నాయి. ఎంతోకాలంగా కొనసాగుతున్న సస్పెన్స్కు మరో రెండ్రోజుల్లో తెరపడనుంది. అధ్యక్ష ఎన్నిక కోసం జులై 1న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం నామినేషన్లను జూన్ 30న స్వీకరించనున్నారు. అదే రోజు సాయంత్రం రిటర్నింగ్ అధికారులు ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు కేంద్ర వ్యవసాయ రాష్ట్ర మంత్రి శోభా కరండ్లాజే రిటర్నింగ్ అధికారిగా నియమితులయ్యారు, అయితే ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎన్నికకు కర్ణాటక బీజేపీ నాయకుడు పీసీ మోహన్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించనున్నారు.
ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధ్యక్ష ఎన్నిక కీలకం కానుంది. పార్టీని విస్తరించి, పార్టీ భవిష్యత్తు కోసం, నాయకుల్లో వైషమ్యాలు రెచ్చగొట్టే వారిని కాకుండా, పార్టీ ఎదుగుదలకు పనిచేసే వ్యక్తిని అభ్యర్థి రేసులో నిలబెట్టి గెలిపించుకోనున్నట్లుగా సమాచారం. ప్రస్తుత అధ్యక్షురాలు పురందేశ్వరిపై పార్టీలోని అనేక వర్గాలు వ్యతిరేక స్వరం వినిపిస్తున్నాయన్నది బహిరంగ రహస్యమే. ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎన్నిక సమయంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు సూచించిన వ్యక్తులకు కాకుండా అధిష్టానం కొత్త వ్యక్తులకు అవకాశం కల్పించి ఆమెకు షాక్ ఇచ్చిందని ఆ పార్టీ నేతలే బయటపెట్టారు. తెలంగాణలో సొంత పార్టీ బలోపేతానికి ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి కృషిచేస్తే.. ఏపీలో మాత్రం వేరొక పార్టీ వృద్ధికి బీజేపీ రాష్ట్ర నాయకత్వం పనిచేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ సారథ్య బాధ్యతల మార్పు అటు రాష్ట్రంలోనూ, ఇటు బీజేపీ శ్రేణుల్లో కీలక పరిణామం కానుంది.
తెలంగాణలో బీజేపీ అధ్యక్ష పదవి కోసం పలువురు ప్రముఖ నాయకులు పోటీలో ఉన్నారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఈ రేసులో ముందంజలో ఉన్నారు. ఈటల రాజేందర్, గతంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో మంత్రిగా పనిచేసిన అనుభవజ్ఞుడు, 2024 లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి భారీ మెజారిటీతో గెలిచారు. ధర్మపురి అరవింద్ కూడా నిజామాబాద్లో బీజేపీ బలాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషించారు. ఇతర అభ్యర్థులలో మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు, మాజీ ఎమ్మెల్యే కె. వెంకట రమణ రెడ్డి ఉన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ అధిష్ఠానం ఈ ఎన్నికల ద్వారా హైదరాబాద్తో సహా గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో పార్టీ బలాన్ని మరింత పెంచే నాయకుడిని ఎంచుకోవాలని భావిస్తోంది.