ప్రముఖ డెయిరీ సంస్థ హెరిటేజ్ పాల (Heritage Milk) నాణ్యత (Quality) ప్రశ్నార్థకంలో పడింది. హెరిటేజ్ పాలపై వివిధ ప్రాంతాల్లో పలు అభియోగాలు వస్తున్న నేపథ్యంలో.. ఓ కుటుంబం తమకు ఆ పాల వల్ల ఎదురైన ఇబ్బందిని ప్రశ్నిస్తూ ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన కూకట్పల్లి పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. కూకట్పల్లి (Kukatpally)లోని రత్నదీప్ సూపర్మార్కెట్ (Ratnadeep Supermarket)లో కొనుగోలు చేసిన హెరిటేజ్ పాల ప్యాకెట్ పగిలిపోయిందని ఆరోపిస్తూ బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అరుదుగా వచ్చే కేసులలో ఇదొకటిగా నిలిచింది. ఈ ఫిర్యాదుపై కూకట్పల్లి పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు (Case) నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
బాధితుల కథనం ప్రకారం.. రత్నదీప్ సూపర్ మార్కెట్లో ఓ కుటుంబం రెండు హెరిటేజ్ పాల ప్యాకెట్లను కొనుగోలు చేసింది. మొదటి ప్యాకెట్ను కాచినప్పుడు ఎలాంటి సమస్య లేకపోయినా, రెండో ప్యాకెట్ను కాచేసరికి పాలు పగిలిపోయినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని దుకాణ యాజమాన్యంతో ప్రశ్నించగా, “మేము ఏం చేయగలం?” అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు బాధితులు ఆరోపించారు. దుకాణదారుడి స్పందనతో అసంతృప్తి చెందిన వారు, న్యాయం కోసం కూకట్పల్లి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు.
కూకట్పల్లి పోలీసులు వెంటనే ఫిర్యాదును స్వీకరించి పగిలిన పాల ప్యాకెట్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, దానిని ఫోరెన్సిక్ పరీక్ష (Forensic Report)కు పంపించారు. అలాగే, రత్నదీప్ సూపర్మార్కెట్లోని సీసీటీవీ ఫుటేజ్ను సేకరించి, దుకాణ యాజమాన్యం, సిబ్బందిని విచారిస్తున్నారు. ఈ కేసు ఆహార ఉత్పత్తుల నాణ్యత, వినియోగదారుల హక్కులపై సమాజంలో మరోసారి చర్చకు దారితీసింది. “పగిలిన పాలు కల్తీ కారణంగా జరిగాయా లేక ఇతర సాంకేతిక లోపమా అనేది ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే స్పష్టమవుతుంది.