తిరుపతి జిల్లా (Tirupati district)లో ఏనుగుల (Elephants) బీభత్సం (Rampage) సృష్టించాయి. ఎర్రావారిపాళెం (Erravaripalem) మండలంలోని బోయపల్లి సమీపంలో ఏనుగుల గుంపు మరోసారి స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. గజరాజుల గుంపును అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు ప్రయత్నిస్తున్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది (Task Force Personnel)పై ఒక ఏనుగు దాడి చేసింది. ఈ ఘటనలో సెక్షన్ ఆఫీసర్ మునుస్వామి (Munuswamy), గార్డు లక్ష్మీప్రసాద్ (Lakshmiprasad) గాయపడ్డారు. ప్రస్తుతం వారు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అటవీ శాఖ అధికారుల వివరణ ప్రకారం.. డ్రోన్ల సాయంతో ఏనుగుల గుంపును గుర్తించిన సిబ్బంది, వాటిని అడవిలోకి తిరిగి పంపేందుకు జాగ్రత్తగా ప్రయత్నిస్తుండగా, ఒక్కసారిగా ఒక ఏనుగు ఎదురుగా దూసుకొచ్చి దాడి చేసింది. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతను సృష్టించింది, సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
ఇటీవలి కాలంలో తిరుపతి జిల్లా, ముఖ్యంగా చిత్తూరు, విజయనగరం, శ్రీకాకుళం వంటి ప్రాంతాల్లో అడవీ ఏనుగుల సంచారం గణనీయంగా పెరిగింది. ఈ ఏనుగులు పంటలను నాశనం చేయడం, గ్రామాల్లోకి చొరబడడం, మరియు మానవులపై దాడులు చేయడం వంటి సంఘటనలు తీవ్రతరం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్ణాటక నుంచి నాలుగు కుంకీ ఏనుగులను మే 21న స్వీకరించింది. ఈ కుంకీ ఏనుగులు ద్వారా అటవీ ఏనుగుల అరాచకాలను అరికట్టనున్నారు.