ఛత్తీస్గఢ్ (Chhattisgarh) దండకారణ్యంలో మరోసారి భీకర ఎన్కౌంటర్ ( Intense Encounter) చోటుచేసుకుంది. దంతెవాడ – బీజాపూర్ (Dantewada – Bijapur) సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలపై విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు తెల్లవారుజాము నుంచే స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో మావోయిస్టులు (Maoists) ఎదురుపడటంతో ఇరువర్గాల మధ్య గంటల పాటు ఎదురు కాల్పులు సాగాయి.
ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ (Dandakaranya Special Zonal Committee) కీలక సభ్యురాలు రేణుక (Renuka) అలియాస్ చైతే అలియాస్ సరస్వతి (Saraswati) తీవ్రంగా గాయపడి సంఘటనా స్థలంలోనే మృతి (Died) చెందింది. వరంగల్ జిల్లా కడవెండి (Kadavendi) గ్రామానికి చెందిన ఆమె, 35 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో క్రియాశీలంగా ఉన్నట్లు తెలుస్తోంది.
భారీగా ఆయుధాలు స్వాధీనం
దంతెవాడ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి రేణుక మృతదేహంతో పాటు రైఫిల్, మందుగుండు సామగ్రి, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ (Gaurav Rai) అధికారికంగా వెల్లడించారు. ఈ ఘర్షణ అనంతరం మిగతా మావోయిస్టులు దొరికిపోకుండా అడవుల్లోకి పారిపోయినట్లు తెలుస్తోంది. పోలీసులు వీరి గూఢచర్యాన్ని మరింత కట్టడి చేసేందుకు కూంబింగ్ ఆపరేషన్ (Combing Operation) ముమ్మరం చేశారు.