ఎన్టీఆర్ జిల్లా తొర్రగుంటపాలెంలో సాయి కోల్డ్ స్టోరేజ్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రమాద తీవ్రత అధికమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని నాలుగు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
మిర్చి దహనంతో ప్రజలకు తీవ్ర అసౌకర్యం
కోల్డ్ స్టోరేజ్లో పెద్ద మొత్తంలో మిర్చిని నిల్వ చేసిన కారణంగా మంటల వేడికి ఘాటు వెదజల్లింది. పరిసర ప్రాంత ప్రజలు కళ్లు, ఊపిరితిత్తులలో మంటలు, శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిస్థితి దారుణంగా మారడంతో చుట్టుపక్కల ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి దూరంగా వెళ్లిపోయారు.
రూ. 12 కోట్ల భారీ నష్టం
ఈ అగ్ని ప్రమాదంలో కోల్డ్ స్టోరేజ్ పూర్తిగా దగ్ధమవడంతో సుమారు రూ. 12 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి కారణం తెలియరాలేదు. పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.