పోలీసుల ఆంక్షలు, అరెస్టుల నడుమ రైతుల పక్షాన వైసీపీ నేతల పోరాటం కొనసాగుతోంది. అన్నదాత సమస్యలపై పోరాటానికి సిద్ధమైన వైసీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. కలెక్టర్లకు వినతిపత్రం అందించేందుకు ఇంటి నుంచి ర్యాలీగా బయల్దేరిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు అవినాష్, పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు దారి మధ్యలోనే అడ్డుకొని అరెస్టు చేశారు. కాగా, శాంతియుతంగా నిరసన తెలిపి, కలెక్టర్కు వినతిపత్రం అందజేసేందుకు వెళ్తుంటే అరెస్టు చేయడం ఏంటని అవినాష్ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఇంటి చుట్టూ పోలీసులు మోహరించి, ఆయనను బయటికి వెళ్లకుండా ఆంక్షలు విధించారు. కార్పొరేటర్లకు కూడా ఇలాంటి నిర్బంధ ఆదేశాలు ఇవ్వడం ప్రజాస్వామ్య విలువలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ పోలీసులు తీరు, కూటమి ప్రభుత్వ వైఖరిపై వైసీపీ నేతలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం? అని ప్రశ్నిస్తున్నారు. రైతుల కోసం పోరాటం చేయడం తప్పా.. ఇచ్చిన హామీలను అమలు చేయమనడం నేరమా..? ఈ రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ప్రశ్నిస్తున్నారు.