నీతిలేని రాత‌ల‌తో మాపై విష‌ ప్ర‌చారం.. – వైఎస్ మ‌ద‌న్‌మోహ‌న్‌రెడ్డి ధ్వ‌జం

నీతిలేని రాత‌ల‌తో మాపై విష‌ ప్ర‌చారం.. - వైఎస్ మ‌ద‌న్‌మోహ‌న్‌రెడ్డి ధ్వ‌జం

గ‌త రెండ్రోజులుగా వైఎస్ కుటుంబంపై జ‌రుగుతున్న దుష్ప్ర‌చారాన్ని దివంగ‌త వైఎస్ అభిషేక్‌రెడ్డి తండ్రి వైఎస్ మ‌ద‌న్‌మోహ‌న్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. నీతిలేని రాత‌ల‌తో ఎల్లో మీడియా శ‌క్తివంచ‌న లేకుండా ప‌నిచేస్తూ ఒక అబ‌ద్ధాన్ని ప‌దే ప‌దే చెబుతూ దాన్ని నిజ‌మ‌ని న‌మ్మించే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని, అందుకు ప్ర‌భుత్వ పెద్ద‌లు కూడా వ‌త్తాసు ప‌ల‌క‌డం దుర్మార్గ‌మ‌ని వైఎస్ మ‌ద‌న్‌మోహ‌న్‌రెడ్డి మండిప‌డ్డారు. ఈ మేర‌కు ఆయ‌న ఒక బ‌హిరంగ లేఖ‌ను విడుద‌ల చేశారు.

గుడ్డ కాల్చి ముఖానేస్తున్నారు..
త‌న కుమారుడు వైఎస్ అభిషేక్‌ మృతి త‌మ కుటుంబానికి తీర‌నిలోటు అని, ఆ బాధ నుంచి కోలుకోలేకపోతున్నామ‌ని వైఎస్ మ‌ద‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కుమారుడిని కోల్పోయిన బాధలో తాముంటే.. గుడ్డ కాల్చి ముఖానేస్తున్నారని, ఆ మసి తాము కడుక్కోవాల్సి వస్తోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న‌ కుమారుడు అనారోగ్యంతో చనిపోయారని, బ‌తికించేందుకు డాక్ట‌ర్లు శక్తివంచనలు లేకుండా ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ అభిషేక్‌ను కాపాడుకోలేక‌పోయామ‌ని వాపోయారు.

త‌ప్పుడు క‌థ‌నాలు రాస్తూ..
కుమారుడిని కోల్పోయిన బాధలో తాముంటే.. చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి కేసులో సాక్షులు ఒక్కొక్కరూ చనిపోతున్నారంటూ టీడీపీ అనుకూల మీడియా (ఈనాడు, ఆంధ్రజ్యోతి) తప్పుడు కథనాలు రాస్తూ త‌మ‌ను మాన‌సికంగా వేధిస్తోంద‌ని, ఎల్లో మీడియా అదిగో పులి అంటే.. ప్రభుత్వం పెద్దలు కూడా ఇదిగో తోక అన్నట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వైఎస్ మ‌ద‌న్‌మోహ‌న్‌రెడ్డి మండిప‌డ్డారు.

ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం దుష్ప్ర‌చారం..
ఈసీ గంగిరెడ్డి కరోనాతో చనిపోయారని, త‌న కుమారుడు వైఎస్‌ అభిషేక్‌ రెడ్డి అనారోగ్యంతో సుదీర్ఘ కాలం చికిత్స పొందుతూ చనిపోయారని వైఎస్ మ‌ద‌న్‌మోహ‌న్‌రెడ్డి లేఖ‌లో పేర్కొన్నారు. సహజ మరణాలను అసహజ మరణాలుగా చిత్రీకరించేందుకు ఎల్లో మీడియా ఓ పథకం ప్రకారం పనిచేస్తోందని, వారి దుష్ప్రచారానికి అనుగుణంగా ఇటు ప్రభుత్వ పెద్దల చర్యలున్నాయని ఆరోపించారు. ఎల్లోమీడియా, ప్రభుత్వ ప్రవర్తన చూస్తుంటే అసహ్యమేస్తోందన్నారు.

చిత్త‌శుద్ధి ఉంటే జ్యుడిషియ‌ల్ ఎంక్వైరీ వేయండి
ఈ విష‌యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. జ్యుడిషియల్ ద‌ర్యాప్తున‌కు ఆదేశించాల‌ని వైఎస్ మ‌ద‌న్‌మోహ‌న్‌రెడ్డి డిమాండ్ చేశారు. సాక్షుల మృతిపై సిట్‌ ఏర్పాటు అంటేనే ఏదో కుట్ర దాగుందని అనుమానం వ్య‌క్తం అవుతోంద‌న్నారు. సిట్‌కు బ‌దులుగా జ్యుడిషియల్‌ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ కూటమి ప్రభుత్వం పెడుతున్న అడ్డగోలు కేసులు, చేపడుతున్న ఏక పక్ష విచారణలను అందరం చూస్తూనే ఉన్నామ‌న్నారు. అందుకే జ్యుడిషియల్‌ విచారణ వేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాల‌ని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment