ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని కూటమి ప్రభుత్వం (Coalition Government)పై వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ (Y. S. Jagan) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతుండడంతో పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్ల (Party Regional Coordinators)తో మరియు ముఖ్యనాయకులతో సోమవారం వైఎస్ జగన్ టెలికాన్ఫరెన్స్ (Teleconference) నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు.
ప్రభుత్వంపై ఒత్తిడి
టెలీకాన్ఫరెన్స్లో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. కష్టకాలంలో ఉన్న రైతులకు (Farmers) అండగా నిలవాల్సిన అవసరం ఉందని, అకాల వర్షాలు, ఈదురుగాలులు కారణంగా తీవ్ర నష్టపోయిన రైతులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పండి అని నేతలకు సూచించారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ధాన్యం తడిసిపోయిందని, అనేక ఉద్యానవన పంటలు కూడా తీవ్రంగా నష్టపోయాయని చెప్పారు. వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం అందించినప్పటికీ, కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి, రైతుల పంటలను కాపాడడంలో నిర్లక్ష్యం ప్రదర్శించిందన్నారు. ఉభయ గోదావరి జిల్లాలు సహా, పలు ప్రాంతాల్లో ప్రభుత్వం ధాన్యాన్ని సేకరించడంలో విఫలమైందని, దీంతో రైతులు మరింత ఇబ్బందుల్లో పడుతున్నారన్నారు. అకాల వర్షాలు వలన మరింత నష్టం జరిగి, వ్యవసాయ రంగం కుదేలైపోయిందని వ్యాఖ్యానించారు.
అండగా నిలబడాలని సూచన
‘‘రైతుల పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో మీరందరూ క్షేత్రస్థాయిలో పర్యటనలు నిర్వహించి, రైతులకు బాసటగా నిలవండి. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా రైతులను ఆదుకోవాలి’’ అని వైఎస్ జగన్ పార్టీ కేడర్కు సూచించారు.