రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పార్టీ తరపున గట్టిగా నిలబడిన ప్రజా ప్రతినిధులతో (Public Representatives) మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) భేటీ కానున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలు, కిడ్నాప్లు చేసినా, కేసులు పెట్టి వేధించినా.. అన్ని ఇబ్బందులను గట్టిగా ఎదుర్కొని పార్టీ కోసం నిలబడి పోరాడిన వారి అంకితభావాన్ని గుర్తిస్తూ ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.
తాడేపల్లి (Tadepalli) లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగే ఈ సమావేశానికి బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాల్లోని 8 నియోజకవర్గాల్లోని వైసీపీ ఎంపీటీసీ (MPTC), జడ్పీటీసీ (ZPTC) సభ్యులు, పార్టీ మండల అధ్యక్షులతో పాటు, కో–ఆప్షన్ (Co-Option) సభ్యులు హాజరుకానున్నట్లు వైసీపీ పేర్కొంది.
ఇటీవలి స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో చోటు చేసుకున్న అప్రజాస్వామిక పరిణామాలు చర్చించడంతో పాటు, భవిష్యత్ కార్యాచరణపైనా సమావేశంలో పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తారని, ముఖ్యంగా కష్టకాలంలో పార్టీ కోసం అన్ని కష్టాలు ఎదుర్కొని నిలబడిన నాయకులు, ప్రజా ప్రతినిధులకు మరింత స్ఫూర్తినిచ్చేలా ఈ సమావేశం నిర్వహిస్తున్నారని వైసీపీ సెంట్రల్ ఆఫీస్ (YSRCP Central Office) ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది.