వల్లభనేని వంశీ అరెస్ట్, కొఠారు అబ్బయ్య చౌదరి కేసు విషయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో చట్టానికి, న్యాయానికి చోటు లేకుండా పోయిందని, రెడ్బుక్ రాజ్యాంగంతో అక్రమ అరెస్టులతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. తప్పుడు అంటూ న్యాయమూర్తి ఎదుట ఫిర్యాదు దారుడు అంగీకరించినా.. దాన్ని కూడా తారుమారు చేసేందుకు దుర్మార్గాలకు పాల్పడుతున్నారని వైఎస్ జగన్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో చంద్రబాబు కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉందని వైఎస్ జగన్ అన్నారు. గన్నవరం కేసులో తనపై టీడీపీ వారు ఒత్తిడి తెచ్చి, తప్పుడు కేసు పెట్టించారని ఫిర్యాదు దారుడే జడ్జి ఎదుట వాంగ్మూలం ఇచ్చినా, అధికార పార్టీ కుట్రను బట్టబయలవుతోందని, తమ తప్పులు బయటకు వస్తున్నాయని తట్టుకోలేక, దాన్నికూడా మార్చేయడానికి చంద్రబాబు దుర్మార్గాలు చేస్తున్నారన్నారు.
నిజాలు చెప్పినందుకు దళిత యువకుడ్ని పోలీసులను పంపించి మరీ వేధించడం ఎంతవరకు కరెక్టు? అని ప్రశ్నించారు. వాంగ్మూలం ఇచ్చిన రోజే ఆ దళిత యువకుడి కుటుంబంపైకి పోలీసులు, టీడీపీ కార్యకర్తలు వెళ్లి వారిని బెదిరించి, భయపెట్టడం కరెక్టేనా? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా? కక్షలు తీర్చుకోవడానికి ఇన్నిరకాలుగా వ్యవస్థలను వాడుకుని దుర్మార్గాలు చేస్తారా? అని చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు.
సుప్రీంకోర్టు దృష్టిలో ఉన్న ఈ కేసులో, వారి ఆదేశాలను అనుసరించి దిగువ కోర్టు క్షుణ్ణంగా కేసును విచారిస్తుంటే, పెట్టింది తప్పుడు కేసంటూ వాస్తవాలు బయటకు వస్తుంటే మొత్తం దర్యాప్తును, విచారణను, చివరకు జడ్జిని, న్యాయ ప్రక్రియను అపహాస్యం చేయడం, అధికారముందనే అహంకారంతో మీరు చేస్తున్నది అరాచకం కాదా ఇది? అధికార దుర్వినియోగం కాదా? అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని, వంశీ భద్రతకు ఎలాంటి సమస్య వచ్చినా ఈ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
రాష్ట్రంలో చట్టానికి, న్యాయానికి చోటు లేకుండా పోయింది. తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ, అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో @ncbn కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు అత్యంత…
— YS Jagan Mohan Reddy (@ysjagan) February 14, 2025
దెందులూరులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై తప్పుడు కేసును సైతం వైఎస్ జగన్ తీవ్రంగా ఖండిస్తున్నాను. కళ్యాణ మండపంలో అబ్బయ్య చౌదరి డ్రైవర్పై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బూతులు తిట్టి, తిరిగి అబ్బయ్య చౌదరిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం దుర్మార్గమన్నారు. చింతమనేని బూతుపురాణం వీడియోను కోట్లమంది ప్రజలు చూశారని చెప్పారు. తప్పులు చేసిన టీడీపీ వారిపై చర్య తీసుకోమని కోరితే.. పోలీసులు వైసీపీ వారిపై ఎదురు కేసులు పెట్టి అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో దిగజారిన వ్యవస్థలకు ఈ ఘటన నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు.
ప్రజలకు ఇచ్చిన సూపర్-6, సహా ఇచ్చిన 143 హామీలు నిలబెట్టుకోలేక, ఒక్కటి కూడా అమలు చేయలేక, ప్రజల దృష్టిని మళ్లించడానికి వైసీపీకి చెందిన నాయకులను, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు పెడుతున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ తప్పులను ప్రజలే తమ డైరీల్లో రికార్డు చేసుకుంటూనే ఉన్నారని, తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.