అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు బాగుంటేనే కుటుంబం, రాష్ట్రం, దేశం బాగుంటుందని, మహిళల అభివృద్ధి దేశ ప్రగతికి మూలస్తంభమని ఆయన పేర్కొన్నారు.
ట్విట్టర్ వేదికగా మహిళలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. “మహిళలు బాగుంటే కుటుంబం బాగుంటుంది. కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది” అని గట్టిగా నమ్ముతానని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో మహిళల సాధికారత కోసం 32కు పైగా పథకాల ద్వారా వారి అభ్యున్నతికి బలమైన పునాదులు వేశామని తెలిపారు.
మహిళా సాధికారత కోసం వైసీపీ ప్రత్యేక చర్యలు చేపట్టిందని వైఎస్ జగన్ గుర్తుచేశారు. నామినేటెడ్ పదవులు, ప్రభుత్వ పనుల్లో 50% రిజర్వేషన్ , గిరిజన, దళిత మహిళలను డిప్యూటీ సీఎం, హోంమంత్రి లాంటి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం కల్పించడం, మహిళల భద్రత కోసం “దిశ” వ్యవస్థ ప్రవేశపెట్టడం, అన్ని రంగాల్లో మహిళలకు ప్రోత్సాహం, సంక్షేమానికి 32కు పైగా పథకాల అమలు చేశామని చెప్పారు.