సింహాచలం దుర్ఘటనకు ముమ్మాటికీ ప్రభుత్వానిదే బాధ్యత అని, ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా ఏడుగురు భక్తులు దుర్మరణం చెందారని, ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో 70 అడుగుల పొడవు.. 10 అడుగుల ఎత్తుతో గోడ నిర్మాణం కేవలం ఆరు రోజుల క్రితం మొదలుపెట్టి, రెండ్రోజుల క్రితమే పూర్తి చేశారన్నారు. టెండర్లు పిలవకుండా అంత పెద్ద గోడ నాలుగు రోజుల ముందు నిర్మించడం ఏంటని ప్రశ్నించారు. ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేకుండా నాలుగు రోజుల వ్యవధిలో నాసిరకం గోడకట్టి భక్తుల ప్రాణాలను బలిగొన్నారని మండిపడ్డారు. సింహాచలం అప్పన్న ఆలయంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతిచెందడంతో మాజీ సీఎం వైఎస్ జగన్ విశాఖకు వెళ్లి మృతులకు నివాళులర్పించి బాధిత కుటుంబాలను ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
చందనోత్సవం ఎప్పుడు అన్నది ప్రభుత్వానికి తెలియదా?, ఆరోజు లక్షల మంది భక్తులు వస్తారని కూడా తెలియదా?, అలాంటప్పుడు గోడ నిర్మాణంలో ఎందుకంత ఆలస్యం?, కనీసం టెండర్లు కూడా పిలవకుండా పనులెలా ఇచ్చారు?, పచ్చిగా ఉన్న గోడ వద్ద ఎందుకు క్యూలైన్ ఏర్పాటు చేశారు?, అక్కడ అంత మంది భక్తులను ఎలా నిలబెట్టారు? అని ప్రభుత్వానికి వైఎస్ జగన్ ప్రశ్నలు సంధించారు. సింహాచలంలో మంత్రుల కమిటీ ఏం పర్యవేక్షించింది?. లక్షలాది భక్తులు వచ్చే చోట, తగిన ఏర్పాట్లు ఎందుకు లేవు?. భక్తులంటే అంత నిర్లక్ష్యమా? వారి ప్రాణాలంటే లెక్క లేదా? అని ప్రశ్నించారు.

సింహాచలం మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం సరిపోదని, వారికి కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరిగితే తాము అలాగే ఇచ్చామని గుర్తుచేశారు. అందుకే ప్రభుత్వం రూ.25 లక్షలకు బదులు కోటి ఇవ్వాలన్నారు. ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే, వైసీపీ ప్రభుత్వం వచ్చాక తప్పకుండా ఇస్తామని ప్రకటించారు.
చంద్రబాబు నాయుడుది ప్రతిదీ పబ్లిసిటీ, డైవర్షన్ పాలిటిక్స్ అని వైఎస్ జగన్ అన్నారు. గతంలో కూడా గోదావరి పుష్కరాల్లో ఆయన పబ్లిసిటీ పిచ్చికి 29 మంది చనిపోయారని గుర్తుచేశారు. మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు 11 నెలలు అయ్యిందని, అప్పటి నుంచి పలు చోట్ల అపశృతులు, దుర్ఘటనలు జరుగుతున్నాయని వైఎస్ జగన్ గుర్తుచేశారు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాట జరిగి ఏకంగా ఆరుగురి దుర్మరణం చెందారన్నారు. గతంలో ఏనాడూ అలాంటి ఘటనలు చోటుచేసుకోలేదని, తిరుమలలో, సింహాచలంలో ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణమన్నారు. దుర్ఘటన జరిగిన తర్వాత చంద్రబాబు వచ్చి ఎంక్వైరీ కమిటీ వేస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించి వెళ్తారు కానీ, ఏ చర్యా తీసుకోరన్నారు. తిరుపతి ఘటన తర్వాత ఎస్పీని బదిలీ చేసి, మరో మంచి పోస్టింగ్ ఇచ్చారని ఎద్దేవా చేశారు.