తెలంగాణ (Telangana)లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోనూ కలకలం రేపుతోంది. ఈ అంశంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (Y.S. Sharmila) చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది నిజమేనని షర్మిల పేర్కొంటూ, కేసీఆర్(KCR), వైఎస్ జగన్ (Y.S. Jagan) ఇద్దరూ కలిసే ఆ సమాచారాన్ని పంచుకున్నారని ఆరోపించారు. తన ఫోన్తో పాటు తన భర్త ఫోన్ను కూడా ట్యాప్ చేశారని ఆమె చెప్పారు.
గుంటూరు జిల్లా (Guntur District) తాడేపల్లి (Tadepalli)లో జరిగిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. వైఎస్ షర్మిల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ తొలిసారిగా నోరు విప్పారు. మీ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఆ ట్యాపింగ్లో పర్సనల్ విషయాలు కూడా తీసుకొచ్చారని షర్మిల చెబుతున్నారు. దానికేం మీ సమాధానం ఏంటని మీడియా ప్రతినిధి ప్రశ్న అడగ్గా.. ఆ సమయంలో ఆమె క్రియాశీలకంగా ఉన్న నేపథ్యంలో చేశారేమో అని అనుమానం వ్యక్తం చేసినట్టున్నారు. నిజంగా చేశారో లేదో కూడా తెలియదు. ఒకవేళ పక్క రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం (KCR Government) షర్మిలమ్మ ఫొన్ ట్యాపింగ్ చేసి ఉంటే దానికి నాకేంటి సంబంధం అని జగన్ స్పందించారు. తెలంగాణ వ్యవహారంతో తనకు సంబంధం లేదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.