వైసీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి పార్థివదేహానికి ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దంపతులు నివాళులర్పించారు. డాక్టర్ అభిషేక్ రెడ్డి గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. పులివెందులలోని స్వగృహంలో అభిషేక్ రెడ్డి పార్థివదేహానికి పలువురు వైఎస్ కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు నివాళులర్పించారు.
ఉదయం బెంగళూరు నుంచి పులివెందుల చేరుకున్న వైఎస్ జగన్ దంపతులు అభిషేక్రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంతకుముందు అనారోగ్యంతో బాధపడుతున్న వైఎస్ ఆనందరెడ్డి సతీమణి సుశీలమ్మను వారి నివాసంలో పరామర్శించి కుటుంబ సభ్యుల యోగక్షేమాలు తెలుసుకున్నారు.








