”నా పాదయాత్ర అప్ప‌టి నుంచే”.. – వైఎస్ జగన్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

నా పాదయాత్ర అప్ప‌టి నుంచే.. - వైఎస్ జగన్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి (Eluru Assembly Constituency) చెందిన వైసీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister) వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణతో పాటు రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై ప్రతి వారం ఒక నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తానని వైఎస్ జగన్ ప్రకటించారు. ఏలూరుతో ఈ తంతును తిరిగి ప్రారంభిస్తున్నామని తెలిపారు.

మరోసారి పాదయాత్రకు క్లారిటీ
రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల చివర్లో లేదా మార్చి ప్రారంభంలో మూడో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని జగన్ తెలిపారు. అంటే ఈ ప్రభుత్వానికి మిగిలింది కేవలం మరో రెండు బడ్జెట్లు, మూడేళ్ల పాలన మాత్రమేనని వ్యాఖ్యానించారు. అందులో ఏడాదిన్నర తర్వాత తన పాదయాత్ర ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. దాదాపు ఏడాదిన్నర పాటు ప్రజల్లోనే, ప్రజలతోనే ఉండేలా పాదయాత్ర (Padayatra) సాగుతుందని తెలిపారు.

ప్రతి ఇంట్లో అదే చర్చ
ప్రస్తుత కూట‌మి ప్రభుత్వ (Alliance Government) పాలన పూర్తిగా అన్యాయంగా మారిందని జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’తో ఎక్కడైనా, ఎవరిపైనైనా, ఏమైనా చేయొచ్చన్న భావనతో పాలన సాగుతోందన్నారు. అబద్ధాలు, మోసాలు, అక్రమ కేసులతో ప్రజలను వేధిస్తున్నారని, పోలీస్ వ్యవస్థను కూడా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. “జగన్ ఉన్నప్పుడే బాగుండేది. ప్రతి నెల బటన్ నొక్కేవాడు. చెప్పింది చేసే వాడు. మాట నిలబెట్టుకునేవాడు” అన్న చ‌ర్చ‌ ప్ర‌తి ఇంట్లో జ‌రుగుతుంద‌న్నారు. బిర్యానీ పెడతానని నమ్మించి చివరకు పలావ్ కూడా లేకుండా చేశాడ‌ని చంద్ర‌బాబుపై ప్ర‌జ‌లు మండిప‌డుతున్నార‌న్నారు.

నాలుగు కీలక రంగాల విధ్వంసం
చంద్ర‌బాబు (Chandrababu) పాల‌న‌లో వ్యవసాయ రంగం (Agriculture Sector) పూర్తిగా నాశనం అయ్యిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువులు కూడా బ్లాక్‌లో కొనాల్సిన పరిస్థితి వచ్చిందని, రైతు భరోసా కేంద్రాలు పనిచేయడం లేదన్నారు. ఉచిత పంట బీమా, సున్నా వడ్డీ రుణాలు, ఇన్‌పుట్ సబ్సిడీ, మద్దతు ధరలు అన్నీ లేకుండా పోయాయని విమర్శించారు. రూ.40 వేలు ఇస్తామని చెప్పి రైతులకు కేవలం రూ.10 వేలే ఇచ్చారని ఆరోపించారు. విద్య, వైద్యం, వ్యవసాయం పూర్తిగా నాశనం కాగా, తాజాగా శాంతి భద్రతల వ్యవస్థ కూడా కూలిపోయిందన్నారు. రాష్ట్రంలో ఎవరికీ భద్రత లేదని, పోలీసింగ్ కనిపించడం లేదని చెప్పారు. ప్రైవేటీకరణ చివరకు సీఎం పదవికీ వర్తించేలా ఉందంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

ప్రజలతో వైసీపీ మమేకం
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులతో వేధిస్తున్నారని జగన్ ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ప్రజలకు అండగా నిలుస్తోందని చెప్పారు. విద్యార్థులు, యువత, రైతులు, మహిళలు – ఎవరికి ఏ కష్టం వచ్చినా వారి తరపున జెండా పట్టుకుని పోరాడుతున్నామని తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఇక ముందూ పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పని చేయాలని జగన్ పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment