వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపటి నుంచి నాలుగు రోజుల పాటు తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించనున్నారు. పులివెందులలో నాలుగు రోజుల పర్యటనలో సమావేశాలు, ప్రజాదర్భార్, క్రిస్మస్ వేడుకలతో జగన్ బిజీబిజీగా గడపనున్నట్లు తెలుస్తోంది. జగన్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను ఆ పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది.
24వ తేదీ ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి వైఎస్ జగన్ బయల్దేరి ఇడుపులపాయ చేరుకుంటారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద జగన్ తన తండ్రికి నివాళులర్పించనున్నారు. అనంతరం ప్రేయర్ హాల్లో జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొననున్నారు. ఆ తర్వాత కడప నియోజకవర్గ నాయకులతో సమావేశమవుతారు, సమావేశం అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు ఇడుపులపాయ నుంచి పులివెందుల వెళ్లి రాత్రికి అక్కడ నివాసంలో బస చేస్తారు.
25వ తేదీ షెడ్యూల్..
ఉదయం 8.30 గంటలకు క్రిస్మస్ సందర్భంగా సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు, ఆ తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు తాతిరెడ్డిపల్లిలో రామాలయాన్ని ప్రారంభించిన అనంతరం పులివెందుల చేరుకుని రాత్రికి బస చేస్తారు
26వ తేదీ షెడ్యూల్
పులివెందుల క్యాంప్ ఆఫీస్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజాదర్భార్ నిర్వహిస్తారు. నియోజకవర్గ ప్రజలే కాకుండా కడప జిల్లా నలుమూలల నుంచి వచ్చే ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు.
27వ తేదీ షెడ్యూల్
ఉదయం 9 గంటలకు పులివెందుల విజయా గార్డెన్స్లో జరగనున్న వివాహానికి హాజరవుతారు, అనంతరం బయలుదేరి బెంగళూరు వెళతారు.








