క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు.
‘‘ప్రేమ, కరుణ, క్షమ, దాతృత్వం, త్యాగం.. ఇవన్నీ తన జీవితంతో మనకు మార్గదర్శకమైన జీసస్ క్రీస్తు అందించిన అపూర్వ సందేశాలు. ఈ సందేశాలు మానవాళిని చెడు మార్గం నుంచి మంచి మార్గానికి నడిపించే శక్తిగా నిలుస్తాయి. జీసస్ బోధనలు ఎప్పటికీ మనకు ఆదర్శప్రాయంగా ఉంటాయి’’ అని జగన్ తన సందేశంలో పేర్కొన్నారు.
కుటుంబంతో ప్రత్యేక ప్రార్థనలు
వైఎస్సార్ జిల్లా పర్యటనలో ఉన్న వైఎస్ జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న అనంతరం ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.








