మాజీ సీఎం పుట్టిన రోజు సంబరాల్లో పాల్గొన్న వైసీపీ కార్యకర్తలపై కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది. వైసీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) పుట్టిన రోజు సందర్భంగా జరిగిన ఓ తాజా ఘటన ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. జగన్ పుట్టిన రోజున కోడిని కోసి ఫ్లెక్సీకి (Flex Banner) రక్తాభిషేకం చేశారంటూ తిరుపతి ఈస్ట్ పోలీసులు వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేయడం ఆసక్తికరంగా మారింది.
డిసెంబర్ 21న తిరుపతి (Tirupati) కొర్లగుంట కట్టకిందపల్లి సర్కిల్ వద్ద కోడిని కోసి, వైఎస్ జగన్ ఫ్లెక్సీకి రక్తాభిషేకం చేయడం ద్వారా ప్రజలకు భయాందోళన కలిగించారని, ప్రజాశాంతికి భంగం కలిగించారంటూ పోలీసులు అభియోగాలు మోపారు. ఈ ఘటనకు సంబంధించి Cr.No.21/2026 u/s 196(1), 351(2) r/w 3(5) BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో నలందుల బాలసుబ్రమణ్యం రెడ్డి (Nalandula Balasubramanyam Reddy) @ బాలు (A1), అమ్ముగుంట భువన్ కుమార్ (Ammugunta Bhuvan Kumar) (A2)లను నిందితులుగా పోలీసులు గుర్తించారు. వారిని అరెస్ట్ చేసిన అనంతరం తిరుపతి 2వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచారు.
అయితే, ఈ కేసులో పోలీసులు నాన్బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేయడంపై న్యాయమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఇంత చిన్న ఘటనకు ఈ స్థాయిలో కఠినమైన సెక్షన్లు అవసరమా?” అంటూ పోలీసులను కోర్టు మందలించినట్లుగా సమాచారం. న్యాయమూర్తి ఆదేశాల మేరకు వైసీపీ కార్యకర్తలను విడుదల చేశారు.
ఈ ఘటనపై వైసీపీ శ్రేణులు, సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కక్షతోనే పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇక నెటిజన్లు వ్యంగ్యంగా స్పందిస్తూ, “ఇకపై చికెన్ షాపు యజమానులు కూడా జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే కేసులు తప్పవు” అంటూ సెటైర్లు పేలుస్తున్నారు.








