యస్.. వైఎస్ జగన్ దంపతులు బెస్ట్ పేరెంట్స్. ఈ మాట ఎవ్వరైనా అంగీకరించాల్సిందే. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, పారిశ్రామిక వేత్తగా వైఎస్ జగన్ ఎంత సక్సెస్ అయ్యారో.. పిల్లలను పెంచి, పెద్ద చేయడంలోనూ అంతే సక్సెస్ అయ్యారు. ప్రస్తుత రాజకీయాల్లో ఒక నాయకుడిపై పడే నిందలు, జరిగే అవమానాలు, అవహేళనలు అందరికీ తెలిసినవే. అందులో వైఎస్ జగన్ సీఎం హోదాలో ఉంటూ ఎదుర్కొన్న సవాళ్లు బహుశా ఏ రాజకీయ నాయకుడి జీవితంలో ఉండవేమో. తండ్రి ఆకస్మిక మరణం, అక్రమ కేసులు, జైలు జీవితం, సొంత పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు, ఎయిర్పోర్టులో హత్యాయత్నం, పాదయాత్ర, కుటుంబ వివాదం, బాబాయ్ మృతిపై నిందలు ఇలా ఒకటా రెండా.. జగన్పై వేసిన రాళ్లు, చేసిన దుష్ప్రచారాలు, వేధింపులు చెప్పలేనన్ని ఉన్నా.. ఇవన్నీ తన పిల్లలపై ప్రభావం చూపకుండా పెంచారు జగన్.

కష్టకాలంలోనూ..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో హఠాన్మరణం చెందారు. ఆ బాధ నుంచి కుటుంబం తేరుకోకముందే అక్రమ కేసులు పెట్టి జగన్ను జైలుకు పంపించారు. సుమారు 16 నెలలు జగన్ జైలు జీవితం గడిపారు. ఓ వైపు పిల్లలు, మరోవైపు సాక్షి, ఇంకోవైపు అక్రమ కేసులపై కోర్టుల్లో న్యాయపోరాటం ఇవన్నీ వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతీరెడ్డి సమర్థవంతంగా నిర్వర్తించారు. మామూలుగా చిన్న చిన్న డిస్టబెన్స్లకే చిర్రెత్తిపోతుంటారు సగటు తల్లిదండ్రులు. కానీ, కుటుంబంపై ఇంతటి కఠిన పరిస్థితులు తాండవం చేస్తున్నా.. ఆ ప్రభావం పిల్లలపై పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు జగన్ దంపతులు.
ఇలాంటి కఠిన పరిస్థితుల్లో పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దడం ఆషామాషీ వ్యవహారం కాదు. పేరెంటింగ్ ఎంత కష్టం అనేది సగటు కుటుంబ పెద్దలకు తెలుసు. జగన్ దంపతులు ఆ బాధ్యతను సమర్థంగా నిర్వహించారు. మొదటి అమ్మాయి హర్షారెడ్డి, రెండో అమ్మాయి వర్షారెడ్డిని ఉన్నత చదువులు చదివించారు. రాజకీయంగా ప్రత్యర్థులు వివాదాలు ఎన్ని చుట్టుముట్టినా పిల్లలపై ప్రభావం పడకుండా, వారిని కాంట్రవర్సీలకు దూరంగా పెంచారు. సక్సెస్ ఫుల్ పేరెంట్స్గా నిలిచారు.

పెద్ద కుమార్తె హర్షారెడ్డి..
వైఎస్ జగన్ పెద్ద కూతురు హర్షా రెడ్డి గ్లోబల్ ఫేమ్ బిజినెస్ స్కూల్ ఇన్సీడ్, బిజినెస్ స్కూల్ ఆఫ్ ప్యారిస్లో సీటు సాధించింది. ప్రతిష్టాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన హర్ష, ప్యారిస్ క్యాంపస్లోని ఇన్సీడ్లో మాస్టర్స్ను అభ్యసించారు. హర్ష తన చిన్నతనం నుండే అకడమిక్స్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. ఆమె తన పరీక్షలన్నింటిని డిస్టింక్షన్లో క్లియర్ చేసింది. ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తూ కుటుంబానికి దూరంగా ఉన్న సమయంలో ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE) లో సీటు సంపాదించింది. LSE నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వెంటనే యునైటెడ్ స్టేట్స్ ఆధారిత ప్రపంచ ప్రఖ్యాత MNCలో ఫైనాన్షియల్ కన్సల్టెంట్గా ప్లేస్మెంట్ పొందారు. ఇన్సీడ్కు ప్రపంచంలోని టాప్-4 బిజినెస్ స్కూళ్లు (యూరప్ క్యాంపస్ పారిస్ సమీపంలో, ఆసియా క్యాంపస్ సింగపూర్లో, మిడిల్ ఈస్ట్ క్యాంపస్ అబుదాబిలో, శాన్ ఫ్రాన్సిస్కో హబ్ ఉత్తర అమెరికాలో ఉన్నాయి) వీటిలోని పారిస్ క్యాంపస్లో హర్షారెడ్డి చేరారు.

చిన్న కుమార్తె వర్షారెడ్డి
వైఎస్ జగన్ చిన్న కుమార్తె వర్షారెడ్డి ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక విశ్వ విద్యాలయాల్లో ఒకటైన ‘కింగ్స్ కాలేజీ లండన్లో చేరి గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్నారు. మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఫైనాన్స్) కోర్సు చేసి పట్టభద్రురాలవడంతోపాటు, డిస్టింక్షన్లో ఉత్తీర్ణత సాధించి పట్టాపొందారు. ప్రపంచ ప్రతిష్టాత్మక కింగ్స్ కాలేజ్ స్నాతకోత్సవంలో వైఎస్ జగన్ దంపతులు పాల్గొన్నారు. తమ కుమార్తె గ్రాడ్యుయేషన్ డేను ప్రత్యక్షంగా తిలకించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్ చేశారు. వర్షారెడ్డి గ్రాడ్యుయేట్గా పట్టా అందుకోవడం తమకు ఎంతో గర్వకారణమని, ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు.
కింగ్స్ కాలేజీ ప్రస్థానం..
కింగ్స్ కాలేజీ లండన్ విశ్వవిద్యాలయాన్ని 1829లో నాటి ఇంగ్లాండ్ రాజు కింగ్ జార్జ్-4.. రాయల్ చార్టర్ ద్వారా స్థాపించారు. అంతర్జాతీయ స్థాయి బోధనలో, అత్యాధునిక పరిశోధనల్లో ఈ యూనివర్సిటీకి ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరుంది. ఈ యూనివర్సిటీలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు 14 మందికి ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతులు వరించాయి. ‘కింగ్స్ కాలేజీ లండన్’లో, 185 దేశాలకు చెందిన 23 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.