అబ‌ద్ధాలు, మోసాలు, గోబెల్స్ ప్ర‌చారం.. కూట‌మి పాల‌న‌పై జ‌గ‌న్ ఫైర్‌

అబ‌ద్ధాలు, మోసాలు, గోబెల్స్ ప్ర‌చారం.. కూట‌మి పాల‌న‌పై జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తాజాగా కూట‌మి ప్ర‌భుత్వ తీరుపై, ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌కుండా డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేస్తూ హామీల నుంచి ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ‌ప‌ట్టిస్తున్నార‌ని ఆరోపించారు. కూట‌మి ప్ర‌భుత్వంపై ప్రజల ఆక్రోశాన్ని చంద్రబాబు త‌న మాటలతో దారి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. బుధ‌వారం తాడేప‌ల్లిలోని కేంద్ర కార్యాల‌యంలో ప్ర‌కాశం జిల్లా వైసీపీ నేత‌ల‌తో జ‌గ‌న్ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కూట‌మి పార్టీలు అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ప్ర‌జ‌ల నుంచి తీవ్ర‌మైన వ్యతిరేకత ఈ ప్రభుత్వం పట్ల కనిపిస్తోందని, అందుకు కార‌ణం చంద్రబాబు అబద్ధాలు, మోసపూరిత హామీలేన‌న్నారు.

చంద్రబాబు పాలనపై విమర్శలు..
చంద్రబాబు మోసపూరిత పాలన, గోబెల్స్‌ ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వైఎస్ జ‌గ‌న్ ఆరోపించారు. ప్రత్యేకంగా, రేషన్ బియ్యం వ్యవహారంపై తప్పుదోవలపెట్టే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. గ‌త వైసీపీ ప్రభుత్వం రేషన్ మాఫియాను అరికట్టడంలో విజయవంతమైందని, కానీ, ప్రస్తుత ప్రభుత్వం రేషన్‌ వ్యవస్థను పునరుద్ధరించి దుర్వినియోగానికి అవకాశం కల్పిస్తోందని విమర్శించారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశ‌వ్‌ వియ్యంకుడు బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నా, ఆ షిప్ వ‌ద్ద‌కు ఎందుకు వెళ్ల‌లేద‌ని డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌ను ప్ర‌శ్నించారు జ‌గ‌న్‌.

ట్యాక్స్‌లు, అమ్మ‌కాల‌తో సంప‌ద సృష్టా..
వైసీపీ హయాంలో రామాయపట్నం పోర్టు, మెడికల్ కాలేజీలు మరియు ఇతర ప్రాజెక్టుల రూపంలో సృష్టించిన సంపదను ట్యాక్స్‌లు, అమ్మకాలు ద్వారా చంద్రబాబు తొక్కిపెడుతున్నారని జ‌గ‌న్ విమ‌ర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వ‌చ్చాక కరెంటు బిల్లులు చూస్తే షాక్ కొడుతున్నాయ‌ని, రూ.15 వేల‌ కోట్లకుపైగా ఛార్జీలు పెంచి సామాన్య‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌పై భారం మోపాడ‌న్నారు. గ్రామీణ రోడ్లపై కూడా ట్యాక్స్‌లు వేసే దుస్థితి మొద‌లైంద‌న్నారు. నిర్మాణం తుది ద‌శ‌లో ఉన్న‌ ప్రాజెక్టును ప్రస్తుత ప్రభుత్వం పూర్తిచేయకుండా ఆలస్యం చేస్తోందని మండిపడ్డారు.

వారితో వైసీపీ యుద్ధం

చంద్రబాబుతో పాటు, ఎల్లో మీడియాతోనూ వైసీపీ యుద్ధం చేస్తుంద‌ని వైఎస్ జ‌గ‌న్ అన్నారు. పార్టీ సభ్యులు సోషల్ మీడియా ఖాతాలను సక్రమంగా వినియోగించి, కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు చేస్తున్న అన్యాయాల‌ను తిప్పికొట్టాల‌ని సూచించారు. ప్ర‌తి ఒక్క‌రూ సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండాల‌ని లీడ‌ర్ల‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

రాబోయే రోజుల్లో వైసీపీ కార్యక్రమాలు
రాష్ట్రంలోని ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై వారి మ‌ధ్య‌కు వెళ్లేందుకు మూడు ప్ర‌ధాన కార్యక్రమాలను వైఎస్ జ‌గ‌న్‌ ప్రకటించారు. ఈనెల 13న రైతు సమస్యలపై పోరాటం. కరెంట్ ఛార్జీలపై ఈనెల 27న కార్యక్రమం. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం జనవరి 3న ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment