- భక్తుల భద్రతపై మరీ ఇంత నిర్లక్ష్యమా..? గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా..?
కూటమి ప్రభుత్వం తిరుమల ప్రతిష్టను దిగజార్చేలా ప్రవర్తిస్తోందని, దేవుడంటే భయం, భక్తి లేని చంద్రబాబు.. స్వామివారి లడ్డూ విషయంలో తప్పుడు ప్రచారం చేయించాడని, ప్రభుత్వ అసమర్థతతో భక్తుల ప్రాణాలకే ప్రమాదం కలిగే సంఘటనలు జరుగుతున్నాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మరణించడం బాధాకరమని, ఈ ఘటనను నీరుగార్చేందుకు తప్పుడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ప్రభుత్వం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.

తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన కుటుంబాలను, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వైఎస్ జగన్ పరామర్శించారు. పరామర్శ అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటన ముమ్మాటికీ ప్రభుత్వ తప్పిదమేనని, చంద్రబాబు మొదలు, టీటీడీ అధికారులు, ఛైర్మన్, జిల్లా ఎస్పీ, కలెక్టర్ అందరూ ఇందుకు బాధ్యులేనని చెప్పారు. వీరందరిపై కచ్చితంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబుకు దేవుడంటే భక్తి, భయం లేవని, అందుకే శ్రీ వెంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదంపైనా ఆరోపణలు చేశాడని, ఈరోజు కూడా ఆయన వైఖరి వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. తిరుపతిలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర చరిత్రలోనే లేదు. తొక్కిసలాటకు ఇంత మంది బలి కావడం గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ఏటా వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజు శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దర్శనం కోసం కొన్ని లక్షల మంది వస్తారని, టోకెన్లు ఇచ్చే కౌంటర్ల వద్ద ఎందుకు సెక్యూరిటీ కల్పించలేదు? అని ప్రశ్నించారు. వేలాది మంది పోలీసులు చంద్రబాబు కుప్పం పర్యటన బందోబస్తులోనే ఉన్నారన్నారు.
బైరాగి పట్టెడలోని రామానాయుడు స్కూల్లో ఏర్పాటు చేసిన టోకెన్ సెంటర్ వద్ద, భక్తులను ముందు పార్కులోనే ఉంచేసి, రాత్రికి ఒకేసారి వదిలేశారని ప్రశ్నించారు. కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని బాధితులు చెబుతున్నారన్నారు. తిరుపతికి లక్షల మంది భక్తులు వస్తారని తెలిసినా, వారికి ఏ విధంగా వసతులు కల్పించాలి? ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులు కానీ, టీటీడీ ఛైర్మన్ కానీ ఆలోచించలేదని, భక్తులకు కనీసం మంచినీరు కూడా ఇవ్వలేదు. తాగడానికి మజ్జిగ కూడా సరఫరా చేయలేదని ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా..? అని జగన్ ప్రశ్నించారు.

చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కోసం గతంలో గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటకు 29 మంది చనిపోయారని జగన్ గుర్తుచేశారు. తాను తిరుపతి ఆస్పత్రికి వస్తే వాస్తవాలు ప్రజలకు చెబుతానని భయపడి, తన రాకను అడ్డుకోవాలని కూటమి కుట్ర చేసిందని, తనను ట్రాఫిక్లో ఆపి, తన కాన్వాయ్ ఆస్పత్రికి రావొద్దన్న కుట్ర చేశారని జగన్ చెప్పారు. నిజాలు ఎక్కడ బయటపడతాయోనని చివరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని సైతం తరలించాలని చూశారని, వారు ఎదురు తిరగడంతో ఊర్కున్నారని, అప్పటికి కొందరు పేషెంట్లను బలవంతంగా డిశ్చార్జ్ చేశారని క్షతగాత్రులు తనతో చెప్పారన్నారు జగన్.
తొక్కిసలాటను తక్కువ చేసి చూపుతూ, తప్పుడు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, బీఎన్ఎస్ 194–సెక్షన్కు బదులు బీఎన్ఎస్ 105– సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జగన్ డిమాండ్ చేశారు. దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి. గాయపడిన వారికి మంచి వైద్యం అందించడంతో పాటు, డిశ్చార్జ్ సమయంలో కనీసం రూ.5 లక్షల చొప్పున సాయం అందించాలని, ఇది వైసీపీ డిమాండ్ అని చెప్పారు.