- కాకినాడ పోర్టు కేసులో విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
కాకినాడ సీ పోర్టు అమ్మకంపై విచారణకు హాజరైన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరు గంటలకు పైగా విచారించింది. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ సాయిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఈడీ విచారణలో తనను 25 ప్రశ్నలు అడిగారని, అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు. కర్నాటి వెంకటేశ్వర రావు (కేవీ రావు) ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఈడీ విచారణ చేపట్టిందని, తనకు కేవీ రావుతో ఎలాంటి సంబంధం లేదన్నారు. కాకినాడ సీ పోర్టు విషయంలో తాను ఎవరికి కూడా ఫోన్ చేయలేదని, ఫోన్ చేసి ఉంటే కాల్ డేటా తీసి ఆధారాలు చూపించాల్సిందిగా డిమాండ్ చేశారు.
కేవీ రావు అనే వ్యక్తి తిరుమలకు పంపి దేవుడి ముందు నిజాలు చెప్పని అధికారులను కోరానని, తప్పు చేసి ఉంటే ఏ శిక్షకైనా తాను సిద్ధంగా ఉన్నానని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. కాకినాడ పోర్ట్ షేర్ ట్రాన్స్ఫర్కు తనకు సంబంధం లేదని చెప్పారు. కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు తప్పుడు కేసు అయితే నేను సివిల్ అండ్ క్రిమినల్ సూట్ వేస్తానని ఈడీకి చెప్పినట్లుగా విజయసాయిరెడ్డి తెలిపారు.
2020 మే నెలలో కేవీ రావుకు తాను ఫోన్ చేశానని అధికారులు ప్రశ్నించారని, తాను ఫోన్ చేసినట్లు ఉంటే కాల్ డేటా ఆధారాలు చూపించాలని అధికారులను అడిగానన్నారు. తాను ఫోన్ చేశానని చెప్పడం పూర్తిగా అవాస్తవమన్నారు. కాకినాడ పోర్టు వివాదంలో తనకు ఎలాంటి సంబంధం లేదని విజయసాయిరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. తనపై లుక్ అవుట్ నోటీసులు ఇవ్వడాన్ని విజయసాయిరెడ్డి తీవ్రంగా పరిగణించారు. లుక్ అవుట్ నోటీసులపై తాను ఢిల్లీ హైకోర్టుకు వెళ్లానని చెప్పారు. తనకు సంబంధం లేని విషయాలను ప్రస్తావిస్తున్నారని, దీనిపై న్యాయపరమైన చర్యలకు విజయసాయిరెడ్డి సిద్ధమవుతున్నట్లుగా ఆయన మాటల్లో స్పష్టమవుతున్నట్లు తెలుస్తోంది.