నటుడు, ఏపీఎఫ్డీసీ మాజీ చైర్మన్ పోసాని అరెస్టును ప్రతిపక్ష వైసీపీ తీవ్రంగా ఖండిస్తోంది. పోసాని అరెస్టు అక్రమమని వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోసాని కృష్ణమురళి అరెస్టు అక్రమమని వైసీపీ నేత, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కక్ష సాధింపు పెరిగిపోయిందని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక అక్రమ కేసులతో వేధిస్తున్నారని మండిపడ్డారు. ఎవరినీ వదలను అందరినీ అరెస్ట్ చేయిస్తానంటూ లోకేష్ బరితెగించి మాట్లాడుతున్నాడని, అరెస్టుపై పెట్టే శ్రద్ధ ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై పెట్టాలని సూచించారు.
ఆరోగ్యం బాగోలేదని పోసాని చెప్పినా వినకుండా పోలీసులు అరెస్ట్ చేశారని, నిన్న అరెస్ట్ చేసి నోటీస్లలో ఈరోజు డేట్ వేయడంతోనే అది రాజకీయ కక్షసాధింపు అరెస్టు అని అర్థం అవుతుందన్నారు. రాష్ట్ర ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. అరెస్టులతో ప్రతిపక్షం గొంతు నొక్కలేరని, డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని సూచించారు.