అనకాపల్లి జిల్లా ముచ్చెర్ల గ్రామంలో వందకు వంద శాతం టీడీపీ సభ్యత్వం నమోదు అనేది పచ్చి అబద్ధమని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. గ్రామంలో 1400 మంది ప్రజలు టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్లు వార్తలు రాస్తున్నారని, లేనిది ఉన్నట్లు సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందాలని లోకేష్ చూస్తున్నారన్నారు. సభ్యత్వంపై లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
భీమిలీలో వైసీపీకి బలమైన క్యాడర్ ఉంది..
ముచ్చెర్ల గ్రామంలో వైసీపీ బలంగా ఉందని గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ముచ్చెర్ల గ్రామంలో వందశాతం నమోదు అంటే ఆ గ్రామంలో మీ కూటమి పార్టీలైన జనసేన, బీజేపీ లేవా అని సెటైర్లు వేశారు. ముచ్చర్ల గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీ వైసీపీ గెలుచుకుందని, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 1350 ఓట్లుకు గాను టీడీపీ- వైసీపీకి మధ్య 150 ఓట్లు మాత్రమే తేడా ఉందన్నారు. ఇన్ని ఆధారాలు ఉండగా, గ్రామం మొత్తం టీడీపీ సభ్యత్వం తీసుకుందని ఎలా చెప్తారని ప్రశ్నించారు. భీమిలీలో వైసీపీకి బలమైన క్యాడర్ ఉందని అమర్ చెప్పారు.
ముచ్చెర్లలో 600 ఎకరాలు కొట్టేసే ప్రయత్నం
సభ్యత్వంపై తప్పుడు లెక్కలు చెప్పడం మంచి పద్ధతి కాదని, కొన్నిచోట్ల బెదిరించి సభ్యత్వం నమోదు చేస్తున్నారన్నారు. పక్క రాష్ట్రాల వారికి సభ్యత్వం ఇస్తూ, ఏపీ వారీగా కలరింగ్ ఇస్తున్నారని గుడివాడ అమర్ ఆరోపించారు. ముచ్చెర్ల గ్రామంలో 600 ఎకరాల భూమిని టీడీపీ నాయకులు కొట్టేసే ప్రయత్నంలో భాగంగా సభ్యత్వంపై దొంగ లెక్కలు చెబుతున్నారన్నారు. గత ఏడు నెలలగా ప్రవచనాలు చెపుతున్న మంత్రి అనిత గురించి టీడీపీ గెజిట్ పేపర్ ఈనాడులో వచ్చిందని చెప్పారు. టీటీడీ లెటర్ అమ్ముకునే స్థితికి హోం మంత్రి అనిత పేషీ చేరుకుందన్నారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే నాయకులు టీటీడీ లెటర్ గురించి ఏమీ చెపుతారని ప్రశ్నించారు. టీటీడీ లడ్డు గురించి రాద్ధాంతం చేసిన నేతలు ఏమి సమాధానం చెపుతారని గుడివాడ అమర్ నిలదీశారు.