కాపు నాయకుడు, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇంటిపై జరిగిన దాడిని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి పాల్పడిన యువకుడు గనిశెట్టి గంగాధర్ జనసేన యాక్టివిస్టు అని గుర్తించారు. ముద్రగడ ఇంటిపై దాడి ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ముద్రగడ ఇంటిపై దాడి చేసి అరాచకం సృష్టించిన వ్యక్తి తాను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెబుతున్నాడని, దీనిపై పిఠాపురం ఎమ్మెల్యే స్పందించాలని డిమాండ్ చేశారు.
పిఠాపురం ఎమ్మెల్యే గారికి ఒక విజ్ఞప్తి అంటూ అంబటి సెటైర్లు వేశారు. అయ్యా ఇలాంటి దౌర్జన్యాలను మీరు ప్రోత్సహించడం సమంజసం కాదు, మీరు తక్షణమే దీనిపై స్పందించాలి. మీకు ముద్రగడ పద్మనాభం అంటే గిట్టకపోవచ్చు కానీ, ఇది ఖండించకపోతే ప్రజాస్వామ్యంలో మీరు దౌర్జన్యాలను ప్రోత్సహించినవారు అవుతారు
అంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ముద్రగడ ఇంటిపై దాడికి కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని, ఈ ఘటనపై వేగంగా స్పందించాలని డీజీపీని కోరుతున్నామన్నారు అంబటి. ముద్రగడ పద్మనాభంను వైసీపీ నేతలు కురసాల కన్నబాబు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వంగా గీత, జక్కంపూడి రాజా పరామర్శించారు.
ఈరోజు ఉదయం ముద్రగడ నివాసంపై ట్రాక్టర్తో ఓ వ్యక్తి బీభత్సం సృష్టించారు. ట్రాక్టర్తో కారును బలంగా ఢీకొట్టాడు. ఈ దాడికి పాల్పడిన యువకుడు గనిశెట్టి గంగాధర్ జనసేన యాక్టివిస్టు అని గుర్తించారు. గతంలో ముద్రగడ టార్గెట్గా సోషల్ మీడియాలో రీల్స్, పోస్టులు చేసిన ఆధారాలు బయటకువచ్చాయి.