వైసీపీ నేత వంశీ అక్రమ అరెస్టుపై ప్రభుత్వ తీరును, పోలీసుల వైఖరిని నిరసిస్తూ, ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వైసీపీ నేతలను అవమానించేలా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రవర్తించారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. డీజీపీ అపాయింట్మెంట్ ఇస్తేనే వచ్చామని, కానీ తమను కలవడానికి నిరాకరించాడని, ఎందుకు కలవడం లేదో తమకు అర్థం కావడం లేదని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అనుమానం వ్యక్తం చేశారు. కనీసం వైసీపీ వినతి పత్రాలను కూడా సిబ్బంది తీసుకోకుండా, అవమానించేలా ప్రవర్తించారన్నారు. డీజీపీ ఆఫీస్ గోడకు అయినా అంటించాలనుకుంటే స్టాఫ్ ఒప్పుకోలేదన్నారు.
తమను కలవడానికి నిరాకరించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.. మీడియా ముఖంగానైనా తమ విజ్ఞాపన పత్రాన్ని చూడాల అంబటి కోరారు. వల్లభనేని వంశీని ఎందుకు అరెస్టు చేశారు అర్థం కావటం లేదన్నారు. వల్లభనేని వంశీని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిందని, ఆయన్ను నిర్మూలించాలని ప్రయత్నం చేస్తున్నారని అంబటి రాంబాబు సంచలన ఆరోపణ చేశారు. వంశీని కలవటానికి ఆయన భార్యకు కూడా అనుమతి ఇవ్వలేదన్నారు.
దూషించి.. తిరిగి మాపైనే కేసు..
టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తమ పార్టీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి డ్రైవర్ని అసభ్యకర పదజాలంతో దూషించాడని, తిరిగి ఆయనపైనే కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అంబటి ధ్వజమెత్తారు. ఇంతకంటే అరాచకం ఇంకేమైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. ఈ అంశాలపై గవర్నర్ ని కలిసే విషయమై ఆలోచన చేస్తున్నామని, పోలీసు హెడ్ క్వార్టర్స్ లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక పోలీసు స్టేషన్లలో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి కరెక్టు కాదని, అన్ని లెక్కలు సరైన సమయంలో తేల్చుతామని అంబటి అన్నారు.