వైసీపీ కీలక నేత, ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబంపై గత రెండ్రోజులుగా భూకబ్జా ఆరోపణలు వస్తున్నాయి. కడప శివార్లలో 52 ఎకరాల చుక్కల భూములు, అటవీ భూములు, ప్రభుత్వ భూములను సజ్జల కుటుంబీకులు ఆక్రమించుకున్నారంటూ వచ్చిన ఆరోపణలపై వైసీపీ కార్యాలయం క్లారిటీ ఇచ్చింది. అసలు సజ్జల రామకృష్ణారెడ్డిపై అలాంటి ఆరోపణలకు ఆస్కారమే లేదని, పనిగట్టుకొని టీడీపీ అనుకూల మీడియా ఆయనపై దుష్ప్రచారం చేస్తోందని వైసీపీ మండిపడింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలపై సజ్జల న్యాయపరమైన చర్యలకు దిగుతారని ఆ పార్టీ హెచ్చరించింది.
- అసలు ఈ ఆరోపణలకు ఆస్కారమే లేదు. ఎల్లోమీడియా చెప్తున్నట్టుగా కడప సమీపంలోని మామిడి తోటల్లో ఒక్క సెంటు భూమికూడా సజ్జల రామకృష్షారెడ్డికి లేదు. కబ్జా అన్న ప్రశ్నే తలెత్తదు.
- 1995 ప్రాంతంలోనే అంటే ఇప్పటి చంద్రబాబు అప్పుడు సీఎంగా ఉన్న సమయంలోనే ఇక్కడ పనికిరాని భూములను సజ్జల సోదరులు కొనుగోలుచేశారు. ఆ భూమిలో మామిడితోటలు వేశారు.
- దీనికి దాదాపు పదేళ్ల తర్వాత సజ్జల రామకృష్షారెడ్డి తన వాటా భూములను సోదరులకు విడిచిపెట్టారు. అప్పటినుంచీ ఆయనకు ఆ భూములతో ఆయనకు సంబంధం లేదు. ఇది జరిగినప్పుడు ఆయన రాజకీయాల్లోకూడా లేరు.
- 2014లో ఫారెస్ట్, రెవెన్యూ విభాగాల మధ్య ఈ ప్రాంతంలో మొత్తం భూముల విషయమై వివాదం నెలకొంది. ఫారెస్ట్ కిందకు వస్తుందని అటవీశాఖ, ఆ ప్రసక్తే లేదని రెవెన్యూశాఖలు తలోరకంగా చెప్తున్నాయి. ఇరుశాఖలకు మొత్తం రికార్డులు కూడా సజ్జల సోదరులు అప్పగించారు. సంయుక్తంగా సర్వే చేసి ఏదో విషయం తేల్చాలని సజ్జల సోదరులే పలుమార్లు అర్జీలు పెట్టుకున్నారు.
- కేవలం సజ్జల రామకృష్షారెడ్డిపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డమే లక్ష్యంగా ఎల్లోమీడియా ప్రయత్నిస్తోంది. తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నవారిపై సజ్జల న్యాయపరమైన చర్యలకు దిగుతున్నారు అని హెచ్చరిస్తూ ఆరోపణలపై వైసీపీ క్లారిటీ ఇచ్చింది.