తుని మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ఎన్నిక నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపల్ ఆఫీస్ వద్ద భయానక వాతావరణం చోటుచేసుకుంది. ఇప్పటికే వైస్ చైర్మన్ పదవి ఎన్నిక మూడు సార్లు వాయిదా పడింది. అధికారుల ఆదేశాల మేరకు ఇవాళ ఎన్నిక జరగాల్సి ఉంది. పోలీసులు 144 సెక్షన్ అమలు విధించినా, కూటమి కార్యకర్తలు గుంపులు గుంపులుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని భయానక పరిస్థితి సృష్టించారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.
జిల్లా కలెక్టర్ హామీ మేరకు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు బయల్దేరిన వైసీపీ కౌన్సిలర్లను మార్గమధ్యలో టీడీపీ నేతలు భయభ్రాంతులకు గురిచేశారు. వైసీపీ కౌన్సిలర్లపై దాడికి యత్నించగా, ప్రాణభయంతో కౌన్సిలర్లు పరుగులు పెట్టారు. పోలీసులు సైతం వారికి రక్షణ కల్పించలేకపోయారు. వైసీపీ కౌన్సిలర్లలో ఒక మహిళ గర్భంతో ఉంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నట్లుగా సమాచారం.
కూటమి కార్యకర్తల దాడి నుంచి తప్పించుకునేందుకు వైసీపీ కౌన్సిలర్లు పరుగులు పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తునిలో అధికార పార్టీ వైఖరికి ఈ వీడియో అద్దం పడుతోంది.