ఆధారాలివిగో.. లోకేశ్ వ్యాఖ్య‌ల‌కు ‘వైసీపీ ట్రూత్ బాంబ్‌’ వైర‌ల్‌

ఆధారాలివిగో.. లోకేశ్ వ్యాఖ్య‌ల‌కు 'వైసీపీ ట్రూత్ బాంబ్‌'

శాస‌న‌మండ‌లిలో యూనివ‌ర్సిటీ వీసీల‌పై విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ చేసిన కామెంట్ల‌కు వైసీపీ స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చింది. యూనివ‌ర్సిటీల వీసీలు, కార్పొరేష‌న్ చైర్మ‌న్ల‌ను బెదిరించి రాజీనామా చేయించార‌ని శాస‌న‌మండ‌లిలో వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి వ్యాఖ్యలను మంత్రి లోకేష్‌ తప్పుబట్టారు. వీసీలను ఎవ‌రూ బెదిరించ‌లేద‌ని, ఎవరు బెదిరించారో చెప్పాలని సవాల్ చేస్తున్నా, ఆధారాలుంటే బ‌య‌ట‌పెట్టాలని డిమాండ్ చేశారు. ఆధారాలు సమర్పిస్తే విచారణ జరిపించేందుకు సిద్ధమ‌ని చెప్పారు.

విక్ర‌మ సింహ‌పురి యూనివ‌ర్సిటీ వైస్ ఛాన్స్‌ల‌ర్ రాజీనామా లేఖ‌తో మంత్రి లోకేష్‌ వ్యాఖ్య‌ల‌కు వైసీపీ కౌంట‌ర్ ఇచ్చింది. ట్రూత్ బాంబ్ అంటూ ఓ ట్వీట్‌ను విడుద‌ల చేసింది. వీసీ రాజీనామా లేఖ‌లోని అంశాల‌ను హైలైట్ చేసి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ రాష్ట్రంలోని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లను రాజీనామా చేయమని ఒత్తిడి తెచ్చినట్లు ఆధారాలివిగో అని ట్వీట్‌లో పేర్కొంది. న్యాయ‌బ‌ద్ధంగా విచార‌ణ జ‌రిపించాల‌ని లోకేష్‌కు ప్ర‌తిస‌వాల్ విసిరింది వైసీపీ.

`నారా లోకేష్ ఆదేశాలతో ఛైర్మన్ స్వయంగా వీసీలను పిలిచి రాజీనామా చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఒక వీసీ తన రాజీనామా లేఖలో మంత్రి లోకేష్ బెదిరించినట్లు స్పష్టంగా రాశారు. దాంతో వీసీలపై రాజీనామా చేయాలంటూ ఎందుకు ఒత్తిడి తెస్తున్నారని శాసన మండలిలో వైయస్‌ఆర్‌సీపీ ప్రశ్నించగా.. అడ్డంగా దొరికిపోవడంతో వైస్ ఛాన్సలర్లు గవర్నర్ అధికారం కిందకు వస్తారని మంత్రి నారా లోకేష్ మొదట బుకాయించారు.

కానీ.. వీసీలను బెదిరించినట్లు ఆధారాలు చూపితే విచారణకు ఆదేశిస్తామన్నాడు. మీరే బెదిరించి.. మీరే విచారణ జరిపితే నిజాలు వాస్తవాలు బయటికి వస్తాయా? అని ప్రశ్నిస్తే మౌనమే నారా లోకేష్ సమాధానం అయ్యింది. ఇదిగో ఇప్పుడు నారా లోకేష్ ఒత్తిడితోనే రాజీనామా చేసినట్లు ఆధారాలను బయటపెడుతున్నాం. ఏమాత్రం నిజాయతీ ఉన్నా నారా లోకేష్ ఆ వీసీల రాజీనామాపై న్యాయబద్ధంగా విచారణ చేయించాలి లేదా నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలి. అప్పుడే వాస్తవాలు బయటికి వస్తాయి.. న్యాయం గెలుస్తుంది` అని వైసీపీ త‌న ట్వీట్‌లో డిమాండ్ చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment