సెకీపై “ఈనాడు’’కు వైసీపీ ఓపెన్ ఛాలెంజ్

సెకీపై “ఈనాడు’’కు వైసీపీ ఓపెన్ ఛాలెంజ్

సెకీతో వైసీపీ చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇదే అంశంపై ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక ఈనాడు ప్ర‌చురించిన ఓ క‌థ‌నంపై ఆ పార్టీ సీరియ‌స్‌గా రియాక్ట్ అయ్యింది. మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ వ్యక్తిత్వ హననం కోసం ఇంతగా దిగజారిపోతారా? నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు రాస్తారా? “ఈనాడు’’ మీది జర్నలిజమా? లేక బ్రోకరిజమా? అంటూ వైసీపీ తీవ్ర స్థాయిలో మండిప‌డుతూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై చేస్తున్న అస‌త్యాల‌ను ఖండిస్తూనే ఈనాడుకు వైసీపీ ఓపెన్ ఛాలెంజ్ విసిరింది.

రామేశ్వ‌ర్ ప్ర‌సాద్ గుప్తాకు లింకేంటి?
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో ఏపీ ప్ర‌భుత్వం 2021లో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది అయితే 2021లో జ‌రిగిన ఒప్పందాన్ని రామేశ్వ‌ర్‌కు అంట‌గ‌డుతూ ఈనాడు కథనం ప్రచురించింది. వాస్తవానికి, గుప్తా 2023 జూన్‌లోనే సెకీ సీఎండీగా నియమితులయ్యారు. అంతకుముందు ఆయన కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేశారు. ఇటీవల ఆయనను పదవీ నుంచి తొలగించడంపై జాతీయ మీడియాలో విస్తృతంగా వార్తలు వ‌చ్చాయి. ఈ తొలగింపు అనిల్ అంబానీ సంస్థకు సంబంధించిన ఫేక్ బిడ్ ఆరోపణల కారణంగా జరిగిందని, ఆంధ్రప్రదేశ్‌తో జరిగిన సెకీ ఒప్పందంతో ఎలాంటి సంబంధం లేద‌ని తేలింది. ఈ తొల‌గింపును ఏపీ- సెకీ ఒప్పందానికి లింక్ పెట్ట‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం అని ప్ర‌శ్నించింది.

ద‌మ్మూ, ధైర్యం ఉంటే సెకీతో ఒప్పందాన్ని రద్దుచేయమని మీ గ్యాంగ్‌ లీడర్‌ చంద్రబాబుకు చెప్పాల‌ని, రూ.1.90కే యూనిట్‌ సోలార్‌ వస్తుందని రాసిన ఈనాడు.. మొన్న యాక్సిస్‌తో రూ.4.60కి కొనుగోలు చేస్తూ ఎందుకు ఒప్పందం చేసుకున్నావని దమ్ముంటే చంద్ర‌బాబును ప్రశ్నించు.. లేదా తప్పుడు రాతలు రాసినందుకు ప్రజల్ని క్షమాపణలు కోరాల‌ని ఓపెన్ ఛాలెంజ్ విసిరింది. సెకీతో జరిగిన విద్యుత్ ఒప్పందంపై ఈనాడు త‌ప్పుడు క‌థ‌నం ద్వారా వైఎస్ జ‌గ‌న్‌పై విషం చిమ్మే కార్య‌క్ర‌మం చేస్తోంద‌ని వైసీపీ తాజా ప్ర‌క‌ట‌న‌లో మండిప‌డింది.

రూ.100 కోట్లకు ప‌రువు న‌ష్టం దావా
”2021లో ఆంధ్రప్రదేశ్ డిస్క‌మ్‌లు సెకీతో 7,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై సంతకం చేశాయి, ఇది రాష్ట్రానికి యూనిట్‌కు రూ.2.49 పైసలకే సోలార్ విద్యుత్‌ను అందించే అత్యంత లాభదాయకమైన ఒప్పందం. ఈ ఒప్పందం ప్ర‌కారం 25 ఏళ్లలో రూ.1.1 లక్ష కోట్ల ఆదాయాన్ని రాష్ట్రానికి తెచ్చిపెడుతుందని అంచనా. అయినప్పటికీ, ఈనాడు ఈ ఒప్పందాన్ని తప్పుడు ఆరోపణలతో ముడిపెట్టి, జ‌గన్‌పై దుష్ప్రచారం చేసింది. ఈ కథనంపై జగన్ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు లీగల్ నోటీసులు పంపారు. 48 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తా”మని హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment