భర్తపై ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ (Life Insurance) డబ్బు కోసం ప్రియుడి సాయంతో ఏకంగా తాళికట్టిన భర్త (Husband)నే కడతేర్చిందో కిరాతక భార్య. దాన్ని సహజ మరణంగా చిత్రీకరించేందుకు నిద్రమాత్రలు వేసి, గొంతు నులిమి హత్య చేసి ఆ తరువాత గుండెపోటు అంటూ నాటకం ఆడింది. గత కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా మృతుడి తమ్ముడు ఫిర్యాదు మేరకు తాజాగా వెలుగులోకి వచ్చింది. పల్లటి రమేష్ (Pallati Ramesh) అనే వ్యక్తిపై రూ.2 కోట్లకు పైగా జీవిత బీమా పాలసీలు ఉండటమే ఈ నేరానికి ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు.
వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లాకు చెందిన పల్లటి రమేష్ అనే వ్యక్తితో సౌమ్య అనే యువతితో వివాహం జరిగింది. రమేష్ పేరిట రూ.2 కోట్ల లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది. కాగా, రమేష్ భార్య సౌమ్య (Soumya)కు తన ప్రియుడు దిలీప్ (Dilip)తో వివాహేతర సంబంధం ఉంది. ఈ సంబంధానికి అడ్డు తొలగించుకోవడంతో పాటు, భర్త పేరుతో ఉన్న భారీ ఇన్సూరెన్స్ డబ్బులు పొందేందుకు ఇద్దరూ కలిసి పక్కా ప్లాన్ రూపొందించినట్లు దర్యాప్తులో తేలింది. రమేష్ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరిస్తే ఎలాంటి అనుమానాలు రాకుండా ఇన్సూరెన్స్ మొత్తం చేతికి వస్తుందనే ఆలోచనతో ఈ హత్యకు పాల్పడ్డారు.
ప్లాన్ ప్రకారం రమేష్కు నిద్రమాత్రలు ఇచ్చిన అనంతరం గొంతు నులిమి హత్య చేసి, హార్ట్ ఎటాక్గా అందరినీ నమ్మించేందుకు ప్రయత్నించారు. తొలుత ఇది సహజ మరణంగానే నమోదైనప్పటికీ, మృతుడి తమ్ముడు అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో శవానికి రీ–పోస్ట్మార్టం నిర్వహించారు. ఈ నివేదికతో పాటు పోలీసుల లోతైన విచారణలో అసలు విషయం బయటపడింది.
పోలీసుల ప్రశ్నలకు సౌమ్య, ఆమె ప్రియుడు దిలీప్ ఇద్దరూ హత్య చేసినట్లు అంగీకరించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నిందితులపై హత్యతో పాటు మోసం కేసులు నమోదు చేసి, పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.








