వక్ఫ్ సవరణ బిల్లు (Waqf Amendment Bill) కు లోక్సభ (Lok Sabha) లో ఆమోదం (Approval) లభించడం పట్ల కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యాంగంపై నేరుగా దాడి జరుగుతోందని ఆమె ఆక్షేపించారు. గురువారం రాజ్యసభలో చర్చకు ముందుగా మీడియాతో మాట్లాడిన ఆమె, ఈ బిల్లు బీజేపీ (BJP) కుట్రలో భాగమని మండిపడ్డారు.
శాశ్వత విభజనే లక్ష్యం
సమాజాన్ని శాశ్వతంగా విభజించేందుకు బీజేపీ ఈ బిల్లును తీసుకొచ్చిందని సోనియా గాంధీ ఆరోపించారు. లోక్సభలో ఈ బిల్లును బుల్డోజ్ చేయించారని, రాజ్యాంగానికి అవమానం కలిగించేందుకే వన్ నేషన్ వన్ ఎలక్షన్ (One Nation One Election) బిల్లును తెస్తున్నారని ఆమె విమర్శించారు. మోదీ (Modi) ప్రభుత్వ నిర్ణయాలు దేశాన్ని అగాధంలోకి నెట్టుతున్నాయని, ఈ నిర్ణయాలను కాంగ్రెస్ (Congress) తీవ్రంగా ఖండిస్తోందని ఆమె స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని కేవలం కాగితంపైనే ఉంచి, అమలు చేయకుండా చేయడమే బీజేపీ వ్యూహమని వ్యాఖ్యానించారు.
అర్ధరాత్రి తర్వాత ఓటింగ్..
పార్లమెంట్లో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశమే ఇవ్వకపోవడం సరికాదని సోనియా గాంధీ విమర్శించారు. వక్ఫ్ బిల్లుపై బుధవారం ఉభయ సభల్లో 12 గంటల పాటు వాడివేడిగా చర్చ జరిగింది. అర్ధరాత్రి తర్వాత లోక్సభ స్పీకర్ ఓటింగ్ నిర్వహించగా, 282 మంది అనుకూలంగా, 232 మంది వ్యతిరేకంగా ఓటేశారు. గురువారం ఈ బిల్లు రాజ్యసభలో చర్చకు వచ్చింది.