ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియంలో టీమ్ ఇండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ గౌరవార్థం ఏర్పాటు చేసిన ‘రోహిత్ శర్మ స్టాండ్’ ప్రారంభోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. ఇది రోహిత్ శర్మ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచింది. ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది, ఇందులో రోహిత్తో పాటు అతని కుటుంబ సభ్యులు, ముంబై ఇండియన్స్ జట్టు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మాజీ బీసీసీఐ అధ్యక్షుడు శరద్ పవార్, ఇతర క్రికెట్ దిగ్గజాలు పాల్గొన్నారు.
భావోద్వేగ క్షణాలు
రోహిత్ శర్మ స్టాండ్ను డివెచ్చా పెవిలియన్ లెవెల్ 3లో అతని తల్లిదండ్రులు రివీల్ చేశారు. ఈ క్షణం రోహిత్తో పాటు అతని కుటుంబ సభ్యులను భావోద్వేగానికి గురి చేసింది. ముఖ్యంగా, రోహిత్ సతీమణి రితికా సజ్దే ఈ సందర్భంలో కన్నీటి పర్యంతమైంది. స్టాండ్ ఓపెనింగ్ తర్వాత రితికా తన అత్తమామలు పూర్ణిమా గురునాథ్ చాటుకు వెళ్లి కన్నీళ్లు తుడుచుకున్న దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ సన్నివేశం అభిమానులను కూడా కదిలించింది.
రోహిత్ తన ప్రసంగంలో తన కుటుంబం త్యాగాలను గుర్తు చేసుకున్నారు. “నా తల్లిదండ్రులు, సోదరుడు, అతని భార్య, నా భార్య.. వీరందరూ నా జీవితంలో చాలా ప్రత్యేకమైన వ్యక్తులు. నేను ఈ రోజు ఇక్కడ నిలబడటానికి వారు చాలా త్యాగాలు చేశారు” అని రోహిత్ భావోద్వేగానికి లోనయ్యారు.
రోహిత్ శర్మ స్టాండ్ ప్రారంభోత్సవం కేవలం ఒక క్రీడాకారుడి గుర్తింపు మాత్రమే కాదు, ముంబై క్రికెట్ గొప్ప వారసత్వానికి నిదర్శనం. సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్సర్కర్, విజయ్ మర్చంట్ వంటి దిగ్గజాల సరసన రోహిత్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ ఘట్టం రోహిత్ శర్మ అసాధారణ ప్రతిభ, నాయకత్వం, అతని కుటుంబం, అభిమానుల మద్దతును ప్రతిబింబిస్తుంది.