విశాఖ‌లో గుట్ట‌లుగా గోమాంసం.. వెలుగులోకి సంచ‌ల‌న విష‌యాలు (Videos)

విశాఖ‌లో గుట్ట‌లుగా గోమాంసం.. వెలుగులోకి సంచ‌ల‌న విష‌యాలు

ఏపీ (Andhra Pradesh)కి ఎగ్జిక్యూటివ్ క్యాపిట‌ల్‌గా మారాల్సిన విశాఖ‌ప‌ట్నం (Visakhapatnam) గో మాంసం (Cow Meat) అక్ర‌మ ర‌వాణా (Illegal Transportation)కు కేంద్రంగా మార‌డం అక్క‌డి సంచ‌ల‌నంగా మారింది. ఒక‌టి కాదు, రెండు కాదు ఏకంగా 1.89 ల‌క్ష‌ల గో మాంసాన్ని కోల్డ్ స్టోరేజీలో దాచి, అక్క‌డి నుంచి ప‌లు ప్రాంతాల‌కు అక్ర‌మంగా త‌ర‌లిస్తున్నారు అక్ర‌మార్కులు. గోవును దైవంగా పూజించే ధ‌ర్మిక సంఘాలు దీనిపై నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లుగా ఎందుకున్నార‌నే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి.

విశాఖ కేంద్రంగా గో మాంసం అక్రమ రవాణా జరుగుతోందనే సమాచారం నగరాన్ని కుదిపేసింది. శొంఠ్యం సమీపంలోని మిత్ర కోల్డ్ స్టోరేజ్‌లో భారీగా గో మాంసం నిల్వ ఉంచిన విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు సోదాలు జరిపి సుమారు 1.89 లక్షల కిలోల కౌ మీట్‌ను సీజ్ చేశారు. ఈ ఘటనతో విశాఖ ప్రజలు షాక్‌కు గురయ్యారు. “విశాఖ కేంద్రంగా గోవుల మాంసం ఎగుమతులు జరుగుతున్నాయా?” అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వ్యవహారంపై ఆనందపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గో మాంసం అక్రమ రవాణా నేపథ్యంలో హిందూ ధార్మిక సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. గోవులను వధించడం మాత్రమే కాదు, లక్షల కేజీల మాంసాన్ని ఇంత పెద్ద స్థాయిలో నిల్వ చేయడమేంటని ప్రశ్నిస్తున్నాయి. పోలీసులు కోల్డ్ స్టోరేజ్ యజమానులను, సంబంధిత వాహనదారులను విచారిస్తున్నారు.

పిఠాపురంలో క‌ల్తీ నెయ్యి..
ఇక, ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan) ఇలాకాలో నకిలీ నెయ్యి కలకలం సృష్టించిన విషయం ఇంకా చల్లారలేదు. పశువుల కొవ్వుతో నెయ్యి తయారు చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు, పిఠాపురంలోని మాధవనగర్‌లో ఓ ఇంటిపై దాడి చేశారు. అక్కడ 30 డబ్బాల నకిలీ నెయ్యి నిల్వ ఉన్నట్లు బయటపడింది. పశువుల ఉత్పత్తులను దుర్వినియోగం చేస్తూ ఇటువంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తుండటంపై ప్రజల్లో ఆందోళన నెలకొంది.

అనకాప‌ల్లిలో గోవుల అక్ర‌మ ర‌వాణా
ఇదే సమయంలో ఇటీవ‌ల‌ అనకాపల్లి జిల్లాలో గోవుల అక్రమ రవాణాపై ఏకంగా క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదులు అందాయి. ఏకంగా హోం మంత్రి అనిత అనుచరులే గోవుల‌ అక్రమ రవాణాకు అండగా ఉన్నారని జిల్లా కలెక్టర్‌, ఎస్పీ లకు సోమిరెడ్డి రాజు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. అనకాపల్లి నుంచి వ్యాన్లలో గోవులను హైదరాబాద్‌కు తరలిస్తున్నారని, ఎస్‌.రాయవరం మండలం పెనుగొల్లు గ్రామంలో “చారిటబుల్ ట్రస్టు” పేరిట దందా కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. వారాంతపు సంతలను కూడా ఆదాయ వనరులుగా మార్చుకున్న ఈ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment