విజయవాడ (Vijayawada) లిక్కర్ కేసు (Liquor Case)లో నిందితుల బెయిల్ పిటిషన్లపై ఏసీబీ(ACB) ప్రత్యేక కోర్టులో ఈరోజు కీలక విచారణ జరిగింది. ప్రాసిక్యూషన్ తరపున సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ లూథ్రా (Siddharth Luthra) వాదనలు వినిపించారు. వర్చువల్ విధానంలో లూథ్రా వాదనలు వినిపించారు. విచారణ జరుగుతుండగా, లూథ్రా వాదనలపై ఏసీబీ జడ్జి (ACB Judge) తీవ్రంగా స్పందించారు.
జడ్జి నేరుగా ప్రశ్నిస్తూ.. “కేసు విచారణ పూర్తయిందా లేదా?” అని అడిగారు. దీనికి లూథ్రా సమాధానంగా, విచారణ ఇంకా కొనసాగుతోందని, కొత్త విషయాలను గుర్తించాల్సి ఉందని తెలిపారు. దీనిపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇప్పటి వరకు మూడు సార్లు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చాం, కానీ కొత్త ఆధారాలు కోర్టుకు సమర్పించలేదని జడ్జి వ్యాఖ్యానించారు.
అదే సమయంలో ఇన్వెస్టిగేషన్ అధికారి కూడా కోర్టులో హాజరయ్యారని జడ్జి గుర్తు చేశారు. మెటీరియల్ ఎవిడెన్స్ కూడా సమర్పించకుండానే కోర్టును మిస్గైడ్ చేయడం సరైంది కాదని స్పష్టం చేశారు. బెయిల్ పిటిషన్లపై విచారణ కొనసాగుతుండగా, ఏసీబీ కోర్టు తీర్పు కోసం అందరి దృష్టి నిలిచింది.
ఇటీవల లిక్కర్ కేసులో బెయిల్ పిటీషన్లపై హైకోర్టులో వాదనలు వినిపిస్తూ సిద్దార్థ్ లూథ్రా ఏసీబీ కోర్టు జడ్జిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తాను వాదనలు వినిపించిన కేసులో తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వలేదని న్యాయమూర్తిపై అక్కసు వెళ్లగక్కారు. ఏసీబీ కోర్టు జడ్జి భాస్కరరావును బదిలీ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వానికి తానే సిఫారసు చేశానని ఏకంగా హైకోర్టులో వ్యాఖ్యానించడం న్యాయ నిపుణుల్లో విస్మయాన్ని కలిగించింది. లిక్కర్ కేసులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్కు సలహాదారుగా ఉంటూ ఏకంగా జడ్జిపైనే అనుచిత వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారాయి.








